సేమ్ సీన్. నిన్నటికి ఇవాల్టికి తేడా ఏమీ లేదు. లోక్సభలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. సభ ప్రారంభం కావడం అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ, వైసీపీ పట్టు పట్టడం పోడియంలో అన్నాడీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగడం సభ గంట పాటు వాయిదా పడడం ఇవాళ కూడా యాధావిధిగా జరిగిపోయింది.
లోక్సభ ప్రారంభమైందో లేదో అన్నాడీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలు వెల్ లోకి దూసుకు వచ్చారు. రిజర్వేషన్ల కోటా పెంపు విభజన హామీల అమలు వంటి అంశాలపై టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇక కావేరి నిర్వాహక మండలి ఏర్పాటు చెయ్యాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు వెల్లో నినాదాలతో హోరెత్తించారు. అటు అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని టీడీపీ, వైసీపీ పట్టు పట్టాయి. టీడీపీ, వైసీపీ డిమాండ్కు కాంగ్రెస్ సహా విపక్షాల మద్దతు పలికాయి. దీంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది
గందరగోళ పరిస్థితుల మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయినా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. లోక్సభ విపక్ష ఎంపీల నినాదాలతో హోరెత్తిపోయింది. సభా కార్యక్రమాలు జరిగే అవకాశం లేకపోవడంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.