హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్కు ఏదైనా పనిమీద వెళ్తున్నరా..? అయితే మీ సెల్ ఫోన్ స్టేషన్ లోపలికి తీసుకెళ్లకపోవడమే బెటర్. పొరపాట్న పోలీస్ స్టేఫన్లో ఫోన్ రింగ్ అయ్యిందో మీ పని అయిపోయినట్లే. ఎందుకంటే ఎస్సార్ నగర్ పోలీసులు ఎక్కడా లేని విధంగా సరికొత్త నిబంధన అమలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లోకి రావాలంటే ఫోన్ స్విచ్ఛాఫ్ చెయ్యాల్సిందేనంటూ ఆంక్షలు పెట్టారు.
మాది ఫ్రెండ్లీ పోలీసింగ్ అని గొప్పగా చెప్పుకుంటున్న హైదరాబాద్ పోలీసులు అమల్లోకి వచ్చేసరికి వారి కరుకు బుద్ధి పోనిచ్చుకోవడంలేదు. కొందరు బాబాయ్లు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాటకు అర్థం మార్చేస్తున్నారు. పాదరక్షలు వదిలి లోపలకు రావాలని రెండ్రోజుల క్రితం ఓ స్టేషన్లో నిబంధన పెట్టిన ఘటన మరవకముందే ఎస్సార్ నగర్ పోలీసులు మరో కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. స్టేషన్లోకి వచ్చే ముందు ప్రజలు సెల్ఫోన్ స్విచ్చాఫ్ చేయాలంటూ ఆంక్షలు పెట్టారు. పీఎస్లోకి వచ్చే ముందు ఫోన్ స్విచ్చాఫ్ చెయ్యాలని నోటీసులు అతికించారు. ఎస్సార్ నగర్ పోలీసులు పెట్టిన కొత్త రూల్తో స్థానికులు పరేషాన్ అవుతున్నారు. మొబైల్ ఆఫ్ చెయ్యాలన్న నిబంధనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.