ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. తెలంగాణ ఆర్టీసీ బస్సుతో పాటు మరో ప్రైవేట్ బస్సు, మూడు టిప్పర్లను తగులబెట్టారు. అంతేకాదు తెలంగాణ ఆర్టీసీ బస్సులో నుంచి ప్రయాణికులను కిందకు దించి ఒకరిని కాల్చి చంపారు. మరణించిన వ్యక్తి కానిస్టేబుల్ కావొచ్చని భావిస్తున్నారు.
జగదల్పూర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును సుకుమా జిల్లా డోర్నపాల్ పరిధిలోని కుత్తి గ్రామం దగ్గర మావోయిస్టులు అటకాయించారు. ప్రయాణికులను కిందికి దించేసి ఇన్ఫార్మర్ నెపంతో ఒకరిని కాల్చి చంపారు. తర్వాత బస్సుకు నిప్పంటించారు. ఇటీవల ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు నినాదాలు చేశారు. ఈ ఘటనతో తీవ్ర భయందోళనకు గురైన తెలంగాణ ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు దగ్గర్లోని CRPF క్యాంప్కు చేరుకున్నారు.
తెలంగాణను టార్గెట్ చేస్తామని ఇటీవలి ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు ప్రకటించారు. టీఆర్ఎస్ నేతలే లక్ష్యమని హెచ్చరించారు. ఆ వార్నింగ్ ఇచ్చిన రెండ్రోజులకే ఛత్తీస్గఢ్లో వాహనాల దహనం వ్యక్తి కాల్చివేతకు పాల్పడ్డారు. మరోవైపు మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అప్రమత్తం చేశారు. నాయకులు మారుమూల ప్రాంతాల పర్యటనకు వెళ్ళేటప్పుడు పోలీసు శాఖకు సమాచారం ఇవ్వానని సూచించారు.