కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రధాన అనుచరుడు, నల్గొండ మున్సిపల్ ఛైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇంటికి కూతవేటు దూరంలోనే శ్రీనివాస్ను దుండగులు చంపేశారు. గొడవ జరుగుతోంది ఆపుదాం రమ్మంటూ అర్థరాత్రి శ్రీనివాస్ని తీసుకెళ్లిన దుండగులు ఇంటికి సమీపంలోనే రాళ్లతో కొట్టిచంపారు. అత్యంత పాశవికంగా తల, ముఖం చిద్రంచేసి డ్రైనేజీలో పడేశారు. భర్త దారుణహత్యతో ఆయన భార్య నల్గొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి కుప్పకూలిపోయారు.
ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ దారుణ హత్యకు గురవడంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భోరున విలపించారు. శ్రీనివాస్ డెడ్బాడీని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. శ్రీనివాస్ హత్యకు నిరసనగా జిల్లా బంద్కి పిలుపునిచ్చారు. శ్రీనివాస్ హత్య వెనుక కుట్ర ఉందన్న కోమటిరెడ్డి శ్రీనివాస్కి ఎన్నోసార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే హత్య జరిగిందన్న కోమటిరెడ్డి ఆరోపించారు.
ఈ నేపథ్యంలో శ్రీనివాస్ హత్యపై నల్గొండ జిల్లా ఎస్పీ సుధాకర్ 11పై కేసు నమోదు చేసుకొని వారిలో 8మందిని అరెస్ట్ చేయగా ముగ్గురు పరారీలు ఉన్నారు.ఇదిలా ఉంటే కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు శ్రీనివాస్ హత్యకు ముందు ఏం జరిగిందనే దానిపై ఆరాతీశారు. అయితే హత్యకు ముందు ఒక మిర్చి బండి వద్ద మల్లేశ్, చక్రి, రాంబాబు, గోపి, సతీష్, శరత్ లు ఘర్షణకు దిగారు. ఈ విషయాన్ని నిందితులు పరిష్కారం కోసం బొడ్డుపల్లి శ్రీనివాస్ ను ఫోన్ లో సంప్రదించారు. వెంటనే అక్కడికి చేరుకున్న శ్రీనివాస్ తో కొందరు గొడవపెట్టుకున్నారు. ఈ గొడవలో విచక్షణ కోల్పోయిన నిందితులు బండరాళ్ళతో శ్రీనివాస్ను బలంగా కొట్టారు. శ్రీనివాస్ బతికుంటే ప్రమాదమని నిందితులు చంపేశారు అని ఎస్పీ తెలిపారు. మిగితా నిందితులను కూడా పట్టుకుంటామని ఎస్పీ అన్నారు.