తెలంగాణ టీడీపీ మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన మోత్కుపల్లి తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేస్తే బాగుంటుందన్నారు. రెండు రాష్ట్రాల్లోని తెలుగుదేశం అభిమానులకు ఇదే మంచిదన్నారు. తెలంగాణలో టీడీపీ ఇబ్బందుల్లో ఉందన్న మోత్కుపల్లి భుజాన వేసుకుని నడిపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని మోత్కుపల్లి అన్నారు. టీఆర్ఎస్ కూడా మన పార్టీనే, కేసీఆర్ మన దగ్గరి నుంచి వెళ్లిన వ్యక్తే అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ పార్టీకి సమయం కేటాయించలేరని అన్నారు. గౌరవంగా ఉండాలంటే తెలంగాణలో తెలుగుదేశం ఓటు బ్యాంకు కోసం, పార్టీ కార్యకర్తల కోసం టీఆర్ఎస్లో విలీనమే మంచిదని తెలిపారు.