పైరసీ - పైరసీ ఏ ఇండస్ట్రీ చూసినా ఈ పైరసీ బూతం వెంటాడుతుంది. నిర్మాతలు సినిమాపై ఉన్న ప్యాషన్ తో కోట్లు సినిమాలు తీస్తే ..ఆ సినిమాల్ని ధనార్జనేధ్యేయంగా కొంతమంది వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారు. థియేటర్లో కొత్త బొమ్మ పడిందా అంతే సంగతులు. క్షణాల్లో వెబ్ సైట్లలో, సీడీషాపుల్లో దర్శనమిస్తున్నాయి. అయితే దీన్ని అరికట్టేందుకు నిర్మాతలు , హీరోలు అష్టకష్టాలు పడుతున్నారు. కానీ పైరసీ బూతం ఆగుతుందా అంటే అదీలేదు.
రాను రాను పైరసీ అదో బూతంలా తయారవుతుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రైటర్ కోన వెంకట్ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఓ ట్వీట్ చేశారు. రీసెంట్ గా విడుదులైన గాయత్రి, ఇంటిలిజెంట్, తొలిప్రేమ పైరసీని మూవీ రూల్స్ అనే వెబ్ సైట్లో ఉంచారని వాపోయారు. వ్యయ ప్రయాసల కోర్చి సినిమా తీస్తే ఇష్టం వచ్చినట్లు గా సినిమాను పైరసీ చేసి సొమ్ముచేసుకుంటున్నారని, తద్వారా ఇండస్ట్రీకి ఎంతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చి ఈ వెబ్ సైట్ ను లాక్ చేయించి మమ్మల్ని కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు.
తాజాగా ఈ పైరసీ భూతంపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గాయత్రి సెక్సెస్ మీట్లో మాట్లాడిన ఆయన పైరసీ చేసిన పాపానికి వారి కుటుంబాలు నాశనమవుతాయని హెచ్చరించారు. అంతేకాదు పైరసీని చూసిన వారందరూ నీచాతినీచులని మండిపడ్డారు. 42ఏళ్ల నట జీవితాన్ని అనుభవించిన తాను పైరసీ గురించి మాట్లాడితే బాగుంటుందని కొందరు చెప్పారని, అందుకే మాట్లాడుతున్నట్లు తెలిపారు.
నిర్మాతగా, నటుడిగా గాయత్రి సినిమాకోసం అహర్నిశలు కష్టపడ్డామని , ఆ కష్టాన్ని గంగపాలు చేసే కొంతమంది అవినీతి పరులు సినిమాను పైరసీ చేసి మార్కెట్లోకి విడుదల చేశారని దుయ్యబట్టారు. పైరసీ చేసే వారిని దొంగలారా...స్నేహితులారా - నీచురాలా - పోరంబోకులారా - దుర్మార్గులారా, నికృష్టుల్లారా అని నోటిని అపవిత్రం చేసుకోకూడదన్నారు.
ఇక గాయత్రిలో పొలిటికల్ డైలాగులపై మోహన్ బాబు స్పందించారు. ఎవర్ని ఉద్దేశించి రాయలేదని, కథకుతగ్గట్లే డైలాగులురాసినట్లు చెప్పుకొచ్చారు. తాను ఏ పార్టీకి కొమ్ము కాయడంలేదన్నారు. సమయం వచ్చినప్పుడు తాను ఏ పార్టీకి మద్దతిస్తానో చెబుతానని స్పష్టం చేశారు మోహన్ బాబు.