హైదరాబాద్ మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానం చేసి ప్రయాణికులకు చివరి మైలు వరకు కనెక్టివిటీ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా హైదరాబాద్ ఎంఎంటీఎస్ మలిదశ పనులపై దృష్టిసారించింది. జంట నగరాల్లో నిర్మిస్తున్న ఎంఎంటీఎస్ ప్రాజెక్టుల కోసం రూ.50 కోట్లు, ఎంఎంటీఎస్ ప్రాజెక్టుల భవిష్యత్తు అవసరాలకు రూ.25 కోట్లు, ఘట్కేసర్–రాయగిరికి రూ.75 కోట్లను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ మంగళవారం తెలిపారు. మొత్తం రూ.150 కోట్ల నిధులను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ(హెచ్ఎంఆర్ఎల్)కు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండగా, ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న యాదగిరి గుట్టకు ఎంఎంటీఎస్ రైలు అంమధుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆలయాభివృద్ధి పనుల్లో భాగంగా ఘట్కేసర్–రాయగిరి మార్గంలో ఎంఎంటీఎస్ రైలు సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని నిర్మాణానికి గాను రూ.75 కోట్లు కేటాయించింది.