వరుసకు తమ్ముడైన భరత్‌తో వివాహేతర సంబంధం...

Update: 2018-06-04 06:03 GMT

అనుమానం మూడు నిండు ప్రాణాలను బలిగొంది. తనతో సహజీవనం చేస్తున్న మహిళను అనుమానించిన వ్యక్తి ఆమెతోపాటు అతని కొడుకునీ హతమార్చాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఏఎస్పీ రాధిక, డీఎస్పీ సుబ్బారావు, సీఐ ఆదినారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మర్రిగుంట గ్రామానికి చెందిన పురుషోత్తంకు, గంగవరం మండలం కలవత్తూరుకు చెందిన వనిత(30)కు 12 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి కుమార్తె, కుమారుడు మహేంద్రన్‌ (7) ఉన్నారు. కుటుంబంలో ఏర్పడిన కలహాల కారణంగా నాలుగేళ్ల క్రితం పురుషోత్తం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత వనిత వరుసకు తమ్ముడైన భరత్‌తో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. కొన్నాళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. 

ఇటీవల వనిత తీరుతో వీరి మధ్య దూరం పెరిగింది. అంతేగాక ఆమె ఎక్కువగా పుట్టినింట్లో గడుపుతోంది. ఇంటి పని నిమిత్తం అప్పుడప్పుడు మాత్రమే మర్రిగుంటకు వస్తోంది. దీంతో ఆమె ప్రవర్తనపై భరత్‌కు అనుమానం కలిగింది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి వివాహ వేడుకలకు బయలుదేరిన భరత్‌ మనస్తాపం చెంది  మద్యం మత్తులో వనితను హత్యచేయడంతో పాటు అడ్డుగా ఉన్న మహేంద్రన్‌ను కూడా కత్తితో విచక్షణా రహితంగా నరికి ఉండవచ్చునని పోలీసులు, గ్రామస్తులు భావిస్తున్నారు. అనంతరం తాను కూడా ఆ పూరి గుడిసెలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేకేత్తిస్తోంది.

ఆదివారం ఉదయం ఇంట్లోని వారు ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానంతో గ్రామస్తులు బలవంతంగా తలుపులు తెరిచి చూశారు. వనిత ఆమె కుమారుడు మహేంద్ర రక్తపు మడుగులో మృతి చెంది పడివున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎఎస్‌పి రాధిక పరిశీలించారు.

Similar News