చెడువ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి డబ్బు ఇవ్వలేదని కన్నతల్లినే కడతేర్చాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం ముచ్చర్ల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సీతంనాయుడు.. ఇదే గ్రామానికి చెందిన సత్యవతిని పదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. నాలుగేళ్లుగా సీతంనాయుడు విశాఖలో తాపీ పని చేస్తున్నాడు. రెండేళ్ల నుంచి సీతంనాయుడు తాగుడకు బానిసయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య సత్యవతి పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. సీతంనాయుడు వారంరోజుల కిందట బంధువుల ఇంట్లో పెళ్లి ఉండటంతో.. గ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చిన సీతంనాయుడు.. తల్లి పైడితల్లిని మద్యం తాగడానికి 300 ఇవ్వాలని పట్టుబట్టాడు. ఆమె తనవద్ద లేవని చెప్పడంతో ఆవేశానికి లోనై.. తల్లి తలపై కర్రతో బలంగా కొట్టాడు. దాడిలో స్పృహ కోల్పోయిన పైడితల్లిని చుట్టుపక్కలవారు గమనించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో పైడితల్లి మృతి చెందింది. ఇక ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.