ఇప్పటికే పెట్రో ధరలు పెరిగి కొంచెంకూడా తగ్గకుండా వినియోగదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. తాజాగా పెట్రోల్ డీజిల్ తోపాటు గ్యాస్ ధరలు కూడా మండుతున్నాయి. రాయితీతో కూడిన గ్యాస్ సిలిండర్ ధరను రూ.2.34 మేరకు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. కాగా ఈ పెంపు కేవలం మెట్రో నగరాలకు మాత్రమే వర్తిస్తుందని తెలియజేసాయి. ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.493.55కు చేరగా, కోల్కతాలో రూ.496.65కు, ముంబైలో రూ.491.31, చెన్నైలో రూ.481.84గా ఉంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైల్లో సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.48 పెరిగింది. మిగతా నగరల్లో ఎప్పటినుంచి అమల్లోకి వచ్చేదీ త్వరలో తెలియజేస్తామని చమురు కంపెనీలు శుక్రవారం తెలియజేశాయి. వాస్తవానికి గురువారమే ఈ నిర్ణయం వెలువడినప్పటికీ అధికారికంగా ఆయిల్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి.