నిజామాబాద్ ప్రేమ వ్యవహారం మరొ మలుపు తిరిగింది. తాను భర్త వద్దే ఉంటానని సౌజన్య స్పష్టం చేయడంతో పోలీసులే దగ్గరుండి ఆమెను అత్తింటింకి పంపించారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలను మెజిస్ట్రేట్ దగ్గరకు తీసుకెళ్లారు. మెజిస్ట్రేట్ కౌన్సెలింగ్తో చివరకు కథ సుఖాంతమైంది. దూరమైన ప్రేమజంటను పోలీసులు తిరిగి ఒక్కటి చేయడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
మాక్లూర్ మండలం కొత్తపల్లికి చెందిన సౌజన్య, రేంజల్ మండలానికి చెందిన ప్రాణదీప్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు నో చెప్పడంతో.. నిజామాబాద్ ఆర్యసమాజ్లో దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం మంచి ముహూర్తం ఉండటంతో.. పెళ్లి చేసుకునేందుకు ఆర్యసమాజ్ చేరుకున్నారు. అయితే, విషయం తెలిసిన సౌజన్య కుటుంబ సభ్యులు బైక్లతో తరలివచ్చారు. ఆఖరి నిమిషంలో పెళ్లిని నిలిపివేయాలంటూ ఆర్య సమాజ్ సభ్యులను కోరారు. అంతటితో ఆగకుండా సౌజన్యను ఈడ్చుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. దీనిపై ప్రాణదీప్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టు ఆదేశాల మేరకు సౌజన్యను ప్రాణదీప్ వద్దకే పంపారు.