భారతదేశ న్యాయ చరిత్రలో మరో చారిత్రక బిల్లుకు ముందడుగు పడింది. ముస్లిం మహిళల సాధికారతే లక్ష్యంగా ట్రిపుల్ తలాక్ను నిషేధిస్తూ కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం పొందితే జమ్మూకశ్మీర్ మినహా మిగతా భారతదేశమంతటికీ వర్తించనుంది. భారతదేశ న్యాయ చరిత్రలో మరో చారిత్రక బిల్లుకు ముందడుగు పడింది. ముస్లిం మహిళల సాధికారతే లక్ష్యంగా ట్రిపుల్ తలాక్ను నిషేధిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ముస్లిం మహిళల గౌరవాన్ని, హక్కులను కాపాడేందుకే బిల్లును తీసుకొచ్చామన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లును ఎంఐఎం, అన్నాడీఎంకే, బీజేడీ, ఆర్జేడీ, ముస్లిం లీగ్ పార్టీలు వ్యతిరేకించాయి. బిల్లు అసమగ్రంగా ఉందన్నారు. అయితే ట్రిపుల్ తలాక్ బిల్లును రాజకీయ కోణంలో చూడొద్దన్న మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు.
ట్రిపుల్ తలాక్ బిల్లు చట్ట విరుద్ధమన్నారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. క్రిమినల్ కేసులు పెట్టేలా చట్టం తేవడం సరైంది కాదన్నారు. ప్రాథమిక హక్కులను హరించే ట్రిపుల్ తలాక్ బిల్లుతో ముస్లిం మహిళలకు న్యాయం జరగదన్నారు. ముస్లిం మహిళల సాధికారతకు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మద్దతిస్తుందన్నారు మల్లికార్జున ఖర్గే. అయితే ఎవరితోనూ సంప్రదింపులు, చర్చలు జరపకుండా ఏకపక్షంగా ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టడం సరికాదన్నారు. ముందుగా బిల్లును స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేయాలని ఖర్గే సూచించారు. ఖర్గే సూచనను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తోసిపుచ్చారు. బిల్లు ఆలస్యమైతే అన్యాయానికి గురవుతున్న ముస్లిం మహిళల కన్నీళ్లకు సమాధానం చెప్పేది ఎవరన్నారు.
ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు ఆమోదం పొందితే ఏ విధానంలో తలాక్ చెప్పినా చట్టవిరుద్ధమవుతుంది, అది చెల్లుబాటు కాదు. నిబంధనలు ఉల్లంఘించి ట్రిపుల్ తలాక్ చెబితే నాన్బెయిలబుల్ కేసుతోపాటు వారెంట్ లేకుండానే అరెస్ట్ చేస్తారు, అలాగే బెయిల్ కూడా నిరాకరించే అధికారం ఉంటుంది. గరిష్టంగా మూడేళ్ల జైలుశిక్ష విధించొచ్చు. ఇక విడాకులు పొందిన మహిళకు జీవన భృతి, పిల్లల సంరక్షణపై హక్కు లభిస్తుంది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై ముస్లిం మహిళలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. బిల్లు త్వరగా ఆమోదం పొందాలంటూ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు.