శనివారంనాటికీ కర్ణాటక కేబినెట్ కూర్పుపై క్లారిటీ రావడంతో ముఖ్యమంత్రి కుమారస్వామి పాలనలో వేగం పెంచారు. ఇప్పటికే పలు శాఖలపై పట్టు పెంచుకున్న అయన ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎం, మంత్రుల కాన్వాయ్ కి అవసరమైన కొత్త కార్ల కొనుగోలు మరియు వాటి అలవెన్సులపై పునఃసమీక్షించారు. ఇప్పటికే కార్ల కొనుగోలుకోసం వెచ్చించిన బడ్జెట్ ను 50 శాతంమేర తగ్గించాలని నిర్ణయానికి వచ్చారు. అంతేకాకుండా పని వేళల్లో ప్రభుత్వ అధికారులు మొబైల్ ఫోన్ల వాడకానికి దూరంగా ఉండాలని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలావుంటే కీలకశాఖలు తమవాళ్లకు కావాలని పట్టుబట్టిన కుమారస్వామి వర్గం కేవలం ఆర్ధిక, మునిసిపల్ మరియు పట్టణాభివృద్ధి, చిన్న నీటిపారుదల వంటి శాఖలను మాత్రమే దక్కించుకున్నారు.