పాకిస్థాన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత మాజీ నేవీ అధికారి కుల్భూషణ్ జాదవ్ను ఎట్టకేలకు ఆయన తల్లి, భార్య కలుసుకున్నారు. ఈ ఉదయం ఇస్లామాబాద్ చేరుకున్న జాదవ్ కుటుంబసభ్యులు పాక్ విదేశీ వ్యవహారాల కార్యాలయంలో ఆయనను కలుసుకున్నారు. వారి వెంట భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్ కూడా ఉన్నారు. మొదట ఇస్లామాబాద్లోని భారత దౌత్య కార్యాలయం చేరుకున్న జాదవ్ తల్లి, భార్య.. అక్కడి నుంచి పాక్ విదేశాంగ కార్యాలయంలో ఆయనను కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు వారుజాదవ్తో మాట్లాడారు. కాగా.. ఈ సాయంత్రమే వారు తిరిగి భారత్కు వెళ్లనున్నారు. దాదాపు 21 నెలల తర్వాత జాదవ్ తన కుటుంబసభ్యులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పాక్ విదేశాంగ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. భారీ భద్రత మధ్య జాదవ్ తల్లి, భార్య కార్యాలయం వద్దకు చేరుకున్నారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్, షార్ప్ షూటర్లను భద్రత కోసం నియమించారు. విదేశాంగ కార్యాలయం సమీపంలో మీడియా, భద్రతాసిబ్బంది మినహా ఇతర వాహనాలకు అనుమతినివ్వలేదు.