రెప్పపాటులో ఘోర ప్రమాదం. ఏం జరిగిందో తెలిసే లోపే భారీ నష్టం జరిగిపోయింది. క్షణాల వ్యవధిలోనే పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొండగట్టు ఘోర ప్రమాదంపై ప్రత్యక్ష సాక్ష్యుల మాటలివి. ఎప్పటికిలాగే అక్కడి నుంచి ప్రయాణిస్తున్న ఒక ఒస్సు సురక్షితంగా గమ్యానికి చేరుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అనుకోని విధంగా మృత్యుకోరల్లోకి వెళ్లిన బస్సు అమాయకులను మింగేసింది. అందులో మహిళలే ఎక్కువ కాగా... చిన్నారులు కూడా ఉండటం కూడా విషాదం.
మొదటి పది మంది చనిపోయారని అనుకుంటే కొన్ని నిమిషాల వ్యవధిలోనే మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయింది. ప్రమాదంలో గాయపడి చనిపోయిన వారు కొందరైతే బస్సులో ఊపిరి అందక చనిపోయిన వారు మరికొందరు.
మృతుల్లో ఎక్కువ మంది మహిళలే కావడం విషాదమైతే అందులో చిన్నారులు కూడా ఉండటం మరీ మాటలకందని దారుణం. చనిపోయిన మృతుల్లో ఎక్కువ మంది శనివారపుపేట, తిమ్మాయిపల్లె, హిమ్మత్రావుపేట గ్రామస్తులే కావడంతో ఆ మూడు గ్రామాల్లో విషాదం నెలకొంది.
తల్లిని కోల్పోయిన బిడ్డలు భార్యను కోల్పోయిన భర్తలు ఒకరి కోసం ఒకరు మిన్నంటిన రోదనలు. కొండగట్టు ప్రమాదానికి కారణాలు ఏమైనా కుటుంబాలకు కుటుంబాలే చెల్లాచెదురయ్యాయి. మృతుల కుటుంబాల తలరాతలను మార్చేశాయి. వినాయకపండగ గంటల వ్యవధిలో వినోదాలు పండాల్సిన ఇంట కొండగట్టు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది.
మరికొన్ని నిమిషాల్లో ఘాట్ రోడ్డు నుంచి జాతీయ రహదారికి చేరుకోవాల్సిన బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అతి వేగంగా దూసుకురావడం కూడా ఈ ప్రమాదానికి కారణం. అతి వేగం వల్ల స్పీడ్ బ్రేకర్ దగ్గర బస్సును కంట్రోల్ చేయడం డ్రైవర్ వల్ల కాలేదని... ఈ కారణంగానే కొందరు డ్రైవర్ ఉన్న వైపు ఒరిగిపోయింది. దీని వల్లే బస్సు లోయలో పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
సాధారణంగా ఘాట్ రోడ్డులో ప్రయాణించే బస్సులు పూర్తి ఫిట్నెస్తో ఉన్నాయా అనే దానిపై అధికారులు ముందుగానే పరీక్షించాల్సి ఉంటుంది. అయితే ఈ బస్సు విషయంలో అలాంటి పరీక్షలు చేపట్టలేదన్న విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు కుండబద్దలు కొడుతున్నారు.