ఇప్పటికే వరదల ప్రభావంతో అన్నమో రామచంద్ర అంటూ అలమటితున్న కేరళవాసులకు మరో ముప్పు పొంచి ఉందనే అభిప్రాయం వెల్లడవుతోంది. వరద తాకిడి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో నీటి నిల్వ ఉన్న ప్రదేశాల్లో అంటువ్యాధులు విజృంభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఉన్న మందులు నీళ్లలో కొట్టుకుపోయిన నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలితే నిలువరించడం చాలా కష్టమవుతుందని అంటున్నారు. దీంతో కలుషిత ఆహరం, నీరు తీసుకోకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కలరా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశముందని తద్వారా తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. గతవారం రోజులుగా కేరళ ప్రజలు చికున్గన్యా, డెంగ్యూ, మలేరియా వాధులతో అల్లాడుతున్నారు. కాగా ఇప్పటికే వరదల ప్రభావంతో వందలమంది మృత్యువాతపడగ లక్షలమంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది సహా పలు రక్షణ సంస్థలు కేరళకు చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నాయి.