ఏకబిగిన 105 మంది అభ్యర్ధులను ప్రకటించిన గులాబీబాస్... కొందరిని మార్చబోతున్నారా? అందుకే అంతర్గత సర్వేలు చేయిస్తున్నారా? అభ్యర్ధుల పనితీరు తెలుసుకునేందుకు కొంతమంది ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారా? తాజాగా స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్సీ పల్లా మాట్లాడిన మాటల వెనుక అసలు మర్మమేంటి?
ముందస్తు ఎన్నికల వేడిని రగిలించిన గులాబీ దళపతి వెనువెంటనే 105 మంది అభ్యర్ధులను ప్రకటించారు. అదే స్పీడుతో పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో నేతలందరూ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ప్రగతిభవన్ వేదికగా వార్ రూమ్ ను ఏర్పాటు చేసిన కేసీఆర్ అక్కడి నుంచే అభ్యర్ధుల పనితీరును మానటరింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు.
ముఖ్యనేతలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, శేరి సుభాష్రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్సీలు బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యంగా గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్న అభ్యర్ధులకు కూడా టిక్కెట్లు ఇచ్చిన కేసీఆర్ ఆ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల పనితీరును ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. జనగామ, మహబూబాబాద్, మంథని, మానకొండూరు, స్టేషన్ ఘన్పూర్తో పాటు పలువరు తాజా మాజీ ఎమ్మెల్యేల వ్యవహారం వివాదాస్పదం అవటం అప్పట్లో పార్టీకి ఇబ్బందిగా మారింది. వ్యక్తిగతంగా వారికి బాగా లేకున్నా టిక్కెట్లు ఇచ్చారు కేసీఆర్. అయినా కొంతమంది అభ్యర్ధుల ఫర్ఫామెన్స్లో మార్పు రాలేదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో పోటీ చేయడానికి బలమైన వారికే కేసీఆర్ బీ ఫాం ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చివరికి అదే ప్రమాణికంగా ఉండబోతోందని కీలక నేతలే చర్చించుకుంటున్నారు. మరోవైపు పార్టీలో అసంతృప్త నేతల బలాన్ని కూడా లెక్కించడానికి వీలైంవుతుందని భావిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.