ఆ అభ్యర్థులతో కేసీఆర్‌ ముఖాముఖి

Update: 2018-10-20 09:32 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వ్యూహంపై అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు సమావేశం కానున్నారు. 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ వారితో ఫోన్ లో మాట్లాడుతూ ప్రచారంపై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రచార సరళి, పార్టీ బలాబలాలు, ఇతర అంశాలపై సర్వేలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ, నిరుద్కోగ భృతి, ఆసరా పెన్షన్ల పెంపు, రైతుబంధు సాయం వంటి హామీలిచ్చారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించడంతోపాటు స్థానికంగా లోటుపాట్లు, ఇతర అంశాలపై వారిని అప్రమత్తం చేయడానికి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. 105 నియోజకవర్గాల్లో తాజా సర్వే ఫలితాలను ఆయన వెల్లడించనున్నట్లు సమాచారం. మరోవైపు అభ్యర్థుల అభిప్రాయాలు, ఇతర అంశాలను తెలుసుకోవడంతోపాటు అసమ్మతి వాదులు, అసంతృప్తులకు సంబంధించిన అంశాలు, పార్టీ శ్రేణులతో సమన్వయం ఇతర అంశాలను చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సమావేశం అనంతరం కొంతమంది అభ్యర్థులతో కేసీఆర్‌ ముఖాముఖి సమావేశం కానున్నట్లు తెలిసింది.

Similar News