టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న బయోపిక్స్లో యాత్ర ఒకటి. ఆనందోబ్రహ్మ చిత్రం ఫేమ్ మహీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. 30 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతుంది. జూన్ 20న చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, వైఎస్ ఆర్ పాత్ర పోషిస్తున్న మమ్ముట్టికి సంబంధించిన సన్నివేశాలని చిత్రీకరించారు. యాత్ర సినిమా కోసం మహి వి రాఘవ ముఖ్య పాత్రలని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితని సెలక్ట్ చేసిన దర్శకుడు, వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణ మురళి, షర్మిళ పాత్ర కోసం భూమిక, సబితా ఇంద్రా రెడ్డి పాత్ర కోసం సుహాసినిని సెలక్ట్ చేసినట్టు టాక్. తాజాగా వైఎస్ కుమారుడు జగన్ పాత్ర గురించి సోషల్మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ నటుడు కార్తి జగన్ పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళంలోనూ విడుదలవుతోంది. కార్తికి ఇటు తెలుగులో అటు తమిళంలో మంచి స్టార్డం ఉంది. అందుకే జగన్ పాత్రకు ఆయన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.