కర్ణాటక రాజకీయాలు రోజు మలుపు తిరుగుతున్నాయ్. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్లు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయ్. ఎమ్మెల్యేలతో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నాయ్. ఈగిల్టన్ రిసార్ట్, సాంగ్రీలా హోటల్కు...కర్ణాటక ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకుంది. దీంతో కాంగ్రెస్, జేడీఎస్లు...ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు మరో ప్రాంతానికి షిప్టు చేస్తున్నాయ్. ఈగిల్టన్ రిసార్ట్ను జేడీఎస్, సాంగ్రీలా హోటల్ను కాంగ్రెస్ పార్టీలు ఖాళీ చేశాయ్.
ఎమ్మెల్యేలందర్ని కొచ్చికి తరలించాలని కాంగ్రెస్, జేడీఎస్లు భావించాయ్. ఒకేసారి అందర్ని ఫ్లైట్లో తీసుకెళ్లాలని నిర్ణయించినప్పటికీ...ఫ్లైట్కు ఏవీయేషన్ శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో బస్సుల్లోనే కొందర్ని హైదరాబాద్కు, మరి కొందర్ని కేరళలోని కొచ్చికి తరలించారు. ఆరెంజ్ ట్రావెల్స్లో హైదరాబాద్కు వస్తున్న ఎమ్మెల్యేలు మీడియాకు దొరికారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తారని అనుమానంతోనే...తమ పార్టీ ఎమ్మెల్యేలను బెంగళూరు నుంచి మరో ప్రాంతానికి తరలించినట్లు కుమారస్వామి స్పష్టం చేశారు. ముందుజాగ్రత్తలో భాగంగానే ఎమ్మెల్యేలను రహస్య ప్రాంతానికి పంపినట్లు ఆయన చెప్పారు.
బీజేపీకి అనుకూలంగా వ్యవహరించి...ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన గవర్నర్ వజూబాయ్కు వ్యతిరేకంగా పోరాటానికి సిద్దం కావాలని జేడీఎస్ అధ్యక్షుడు దేవేగౌడ పిలుపునిచ్చారు. రాహుల్గాంధీతో ఫోన్లో మాట్లాడిన దేవెగౌడ తాజా పరిణామాలపై చర్చించారు. చంద్రబాబు, కేసీఆర్ సహా విపక్షనేతలంతా విభేదాలు మరిచి బీజేపీపై పోరాటానికి సన్నద్ధం కావాలని దేవెగౌడ పిలుపునిచ్చారు.