హైదరాబాద్లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు తొలిదశ పూర్తయింది. ముందుగా పెట్టుకున్న టార్గెట్ను బల్దియా అధికారులు అనుకున్న టైం లోపే పూర్తి చేశారు. మొదటి దశలో భాగంగా నగరంలోని ప్రధాన రహదారులపై ఉన్నదాదాపు 4వేల ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించారు. కొత్త సర్వేతో మళ్లీ ఆక్రమణల తొలగింపు చేపడతామని చెబుతున్నారు.
హైదరాబాద్లో ఫుట్పాత్ల ఆక్రమణ ఒక్క రోజులోనే జరగడం లేదు. ఎన్నో ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగి ఆరు టీంలు మూడు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాయ్. కావాల్సినంత సిబ్బంది, 12 జేసిబీలు ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. స్థానికులు అడ్డు పడిన చోట పోలీసుల సహకారంతో ఆక్రమణలను తొలగించారు. 4,133 ఆక్రమణలు గుర్తిస్తే 4,631 ఆక్రమణలు తొలగించి రికార్డు నెలకొల్పామని అధికారులు చెబుతున్నారు.
ఏళ్లుగా ఆక్రమించుకున్న ఫుట్పాత్లను తొలగించటం అంత సులువైన పని కాదు. చాలా మంది గ్రేటర్ సిబ్బందికి అడ్డు తగిలారు. అయితే ఎవర్ని లెక్క చేయకుండా ఫుట్పాత్లు ఆక్రమించింది ప్రైవేట్ వ్యక్తులైనా, ప్రభుత్వ వ్యవస్థలైనా వెనక్కి తగ్గలేదు. అందరికి ఒకటే న్యాయం అంటూ ఫుట్ పాత్లపై కట్టిన అక్రమ కట్టడాలు, పర్మినెంట్గా నిర్మించిన షెట్లర్లను తొలగించారు. ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపునకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారు. గుర్తించిన వాటి కంటే ఎక్కువ కూల్చి వేశామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లోనూ ఈ డ్రైవ్ కొనసాగుతుందని చెబుతున్నారు.
ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపుతో సామాన్య జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం రోడ్లపై నడవాలంటే ఇబ్బంది పడాల్సి వచ్చేంది. ఆక్రమణలు తొలగించిన అధికారులు ఫుట్పాత్లను ఆధునీకరిస్తే బాగుంటుందని సామాన్యులు చెబుతున్నారు. అయితే ఆక్రమణలు తొలగింపు సందర్భంగా పేదల జీవనాధారమైన బండ్లను, వస్తువులను ధ్వంసం చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవతా దృక్పథంతోనే వెండర్ జోన్లు కేటాయిస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. మొదటి దశలో 42 ప్రాంతాలను టార్గెట్ పెట్టుకుని కంప్లీట్ చేసింది ఎన్ ఫోర్స్మెంట్. తొలి దశ విజయవంతం కావడంతో రెండో దశలో ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టింది.