తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి కీలక పదవి దక్కింది. కేబినెట్లో అత్యంత కీలకంగా భావించే హోం శాఖను మహమూద్ అలీకి సీఎం కేసీఆర్ అప్పగించారు. కేసీఆర్తో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు హోంశాఖ దక్కడంతో ఇప్పటి వరకు ఈ పదవి నిర్వహించిన సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డికి ఏ పదవి ఇస్తారనేది ఆసక్తిగా మారింది. నాయినినీ హొం నుంచి తప్పించడం వ్యూహత్మకమా లేక మరేదైనా ఉందానేదిపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన మహమూద్ అలీ మరోసారి బంపర్ ఆఫర్ దక్కించుకున్నారు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన రెండో అత్యున్నత పీఠం దక్కింది. సీఎం కేసీఆర్తో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు హోంమంత్రి బాధ్యతలు అప్పగించారు. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ, మైనార్టీ వ్యవహరాల శాఖ బాధ్యతలను మహమూద్ అలీ నిర్వహించారు. మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన మహమూద్ అలీకి హొం శాఖ కేటాయించడం కొత్త ప్రభుత్వంలో హట్ టాపిక్ గా మారింది.
అయితే రాజకీయ కోణంలోనే మహూమూద్ అలీకి హోం శాఖ కట్టబెట్టినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మైనార్టీకి వర్గం టీఆర్ఎస్కు ఏకపక్షంగా మద్దతిచ్చినట్టు గుర్తించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలను శాశ్వతంగా తన వైపు తిప్పుకునేలా వ్యూహాత్మకంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషిస్తున్నారు. మరోవైపు సామాజిక సమీకరణలు, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగానే మహమూద్ అలీకి హోంశాఖను అప్పగించినట్టు భావిస్తున్నారు.
మహమూద్ అలీకి హోం శాఖ అప్పగించడంతో ఇప్పటి వరకు ఈ శాఖను నిర్వహించిన నాయిని నర్సింహారెడ్డికి ఏ పదవి ఇస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే నాయిని సేవలు పార్టీకి వినియోగించుకునే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన రెడ్డి కార్పోరేషన్ను ఏర్పాటు చేసి నాయినిని ఛైర్మన్గా నియమించే ఆలోచనలో ఉన్నట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ తాజా నిర్ణయంతో అటు ఎమ్మెల్సీలతో పాటు ఇటు ఎమ్మెల్యేల్లోనూ కొత్త ఆశలు రేగుతున్నాయి.