కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మంత్రి హరీష్రావు త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని కాంగ్రెస్నేత ఒంటేరు ప్రతాప్రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు .తన పుట్టుక, చావు టీఆర్ఎస్ పార్టీలోనే అన్న హరీష్రావు తన జీవితం కేసీఆర్ కే అంకితం అన్నారు. ముచ్చటగా మూడోసారికూడా ఓడిపోతాననే భయంతో, మతిస్ధిమితం తప్పి కాంగ్రెస్ నేత ప్రతాప్రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. పక్కాఆధారాలు చూపకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హరీశ్ రావు హెచ్చరించారు.
నేను వారంరోజులుగా గజ్వేల్లోనే ప్రచారం చేస్తుంటే, కనీసం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితిని గ్రహించి వంటేరు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారని హరీశ్ రావు తీవ్రస్థాయిలోమండిపడ్డారు. ఉద్యమం నుంచి వచ్చిన తనను శంకించే స్థాయి ప్రతాప్రెడ్డికి లేదన్నారు. గోబెల్స్ ప్రచారం చేస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోతాననుకుంటున్నాడేమో, ఇక నుంచి ఇక్కడే ఉండి ఎన్నికలయ్యే వరకు ఉండి వంటేరు సంగతి తాడోపెడో తేల్చిస్తా, రాజకీయంగా వంటేరును భూస్థాపితం చేశాకే గజ్వేల్ నుంచి తిరిగివెళ్తానని హరీశ్ రావు స్ఫష్టంచేశారు. రాహుల్ గాంధీ ఓ ఐరెన్ లెగ్అని ఆయనే కాదు సోనియాగాంధీ వచ్చినా గజ్వేల్లో ఏమీ చేయలేరన్నారు. కేసీఆర్ను ఓడించడం ఎవరి తరమూ కాదన్నారు. సర్పంచిగా గెలవలేని ప్రతాప్రెడ్డికి తన గురించి మాట్లాడే స్థాయి లేదన్నారు.