ఉమ్మడి ఆదిలాబాద్ టీఆర్ఎస్ లో చిచ్చు...ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య ఎడ తెగని వార్

Update: 2018-08-03 05:25 GMT

ఆదిలాబాద్ జిల్లా టిఆరెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పార్టీ పరువు తీసేస్తున్నాయి ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీల మధ్య అంతర్గత గొడవలు ముదిరి కార్యకర్తలకు తలనొప్పులు తెస్తున్నాయి. నియోజక వర్గంలో ఎమ్మెల్యే, ఎంపీల తీరు ఎడమొఖం, పెడమొఖంగా ఉండటంతో మధ్యలో కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఈ సమస్యను పార్టీ అధిష్టానం పట్టించుకోకపోతే పార్టీకే నష్టమని ఆందోళన పడుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ   పార్టీ నాయకుల మధ్య లుక లుకలు బయటపడుతున్నాయి. నిర్మల్ జిల్లా  ఖానాపూర్  నియోజకర్గంలో ఎమ్మెల్యే రేఖనాయక్, మాజీ ఎంపి రమేష్ రాథోడ్ మద్య  విభేదాలు  రోజురోజుకు  ముదురుతున్నాయి గతంలో ఒకసారి ఇద్దరు నాయకులు పోలీసు స్టేషన్ కు వెళ్లి పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో పట్టు సాధించడానికి ఇద్దరూ  పావులు కదుపుతున్నారు . మాజీ ఎంపి రమేష్ రాథోడ్  అత్మీయ యాత్ర  పేరుతో ప్రజల్లోకి వెళ్లుతున్నారు.  ఏవరైనా పార్టీ కార్యకర్తలు మరణిస్తే వారికి అర్థిక సహయం అందిస్తున్నారు. జనంతో మమేకమవుతూ తనదైన ముద్రను వేస్తున్నారు. నియోజకర్గంలో అన్ని మండలాల్లో యాత్ర పూర్తిచేసి ఉట్నూర్ లో  బహిరంగ సభకు, ర్యాలీకీ సన్నాహలు చేసుకున్నారు. అయితే రమేష్ రాథోడ్ బహిరంగ సభకు అనుమతినివ్వడాన్ని తప్పు బడుతూ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ పోలీస్ అధికారులను నిలదీశారు. ఆదివాసీల గొడవలు ఉన్న నేపధ్యంలో ర్యాలీకి ఇబ్బందులెదురవుతాయన్న ఉద్దేశంతో పోలీసులు ర్యాలీని అనుమతించలేదు. దాంతో రాథోడ్ కు  పెరుగుతున్న మద్దతు చూసి ఓర్వలేకే రేఖా శ్యామ్ అడ్డుపుల్లలు వేస్తున్నారని నియోజక వర్గంలో ప్రచారం జరుగుతోంది.

ఇక మాజీ ఎంపి వర్గానికి చెందిన ఖానాపూర్ ఎంపిపి పై ఎమ్మెల్యే వర్గానికి  చెందిన ఎంపిటిసిలు  అవిశ్వాసానికి  సిద్ధమవుతున్నారు. దాంతో నియోజకవర్గంలో రెండు వర్గాలు  ప్రత్యర్థులుగా మారి  ఒకర్నొకరు లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగుతున్నారు.  ఇక బోథ్  నియోజకవర్గంలో ఎంపి నగేష్ , ఎమ్మెల్యే రాథోడ్ బాపు రెండు వర్గాలుగా  విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు. తాజాగా ఇచ్చోడ లో పత్తి పంటను పీడించే గులాబీ పురుగుపై జరిపిన అవగహన సదస్సులు  ఎంపి వర్గానికి, ఎమ్మెల్యే రాథోడ్ వర్గానికి మధ్య గొడవలకు దారితీశాయి. ఎంపి  వర్గానికి చెందిన  మార్కెట్  కమిటీ చైర్మన్ అడేశీల ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఎమ్మెల్యే  బాపూరావు బహిష్కరించారు. తను ఎంపీ వర్గానికి చెందినందువల్లే  ఎమ్మెల్యే తనను అవమాన పరిచారని అడేశీల అరోపించారు. నియోజకవర్గంలో ఎంపి, ఎమ్మెల్యే ఇద్దరు  ఒకే పార్టీ చెందిన వారైనా కనీసం అధికారిక సమావేశాల్లో నైనా ఇద్దరూ కలసి పాల్గొనే పరిస్థితి లేదు. ఎంపీ ప్రారంభించిన పథకాలను ఆ తర్వాత ఎమ్మెల్యే  వెళ్లి మళ్లీ  ప్రారంభిస్తున్నారు. ఇద్దరు నాయకులు వర్గాలుగా విడిపోయి వ్యూహాలు రచిస్తుండటంతో ఎన్నికల నాటికి ఈ గొడవ మరింత ముదిరే అవకాశం ఉందని పార్టీ కార్యకర్తలు అందోళన చెందుతున్నారు . ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్యా, మంత్రుల మధ్యా ముదురుతున్న ఈ గొడవలను తక్షణం పరిష్కరించాలని లేకపోతే అది పార్టీకే నష్టమని కార్యకర్తలు వాపోతున్నారు.   

Similar News