ముగ్గురిని పెళ్లి చేసుకుని 4వ పెళ్లికి సిద్ధపడ్డాడో ప్రబుద్ధుడు. విషయం తెలుసుకున్న మూడో భార్య.. భర్త ఇంటి ముందు ఆదివారం నిరసన దీక్ష చేపట్టింది. ఆందోళనకు వస్తున్న విషయం తెలుసుకున్న అత్తింటి వారు ఇంటికి తాళాలు వేసి ఉడాయించారు. బాధితుల కథనం ప్రకారం...సరూర్నగర్ భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉండే కృష్ణ, భారతి దంపతుల కుమారుడు శ్రీనివాస్కు మే 23, 2014న కామారెడ్డి శ్రీరమణారెడ్డి కాలనీకి చెందిన నారాయణ, నాగరాణి దంపతుల కుమార్తె అనూషతో వివాహం జరిగింది. రూ.5లక్షల నగదు, 15తులాల బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చి ఘనంగా వివాహం జరిపారు. రెండు సంవత్సరాల పాటు కాపురం సాపీగా సాగగా ఆ తరువాత అనూషకు వేధింపులు మొదలయ్యాయి. అత్తగారింటి వేధింపులకు తట్టుకోలేక కొంత కాలం నుంచి అనూష పుట్టింటి వద్దే ఉంటోంది.
గతంలో జరిగిన పెళ్లిళ్లను దాచి అనూషను పెళ్లి చేసుకుని ఈమెను కూడా వదిలించుకోవడానికి విడాకుల నోటీసులు పంపించాడు. అంతేగాకుండా ఈ నెల 25న మరో మహిళతో 4వ పెళ్లికి సిద్ధపడినట్లు తెలుసుకుని అనూష ఆదివారం హైదరాబాద్కు వచ్చి సరూర్నగర్ మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం భాగ్యనగర్ కాలనీలో అత్తగారింటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది. ఆందోళనకు గురైన అనూష అక్కడే నిరసన దీక్ష చేపట్టింది. అత్త, భర్త, ఆడపడుచు, ఆమె భర్త చిత్ర హింసలు పెట్టేవారని ఆవేదన వ్యక్తం చేసింది.