గాంధీ ఆస్పత్రిలో కామాంధులు..ఒప్పుకోకపోతే ల్యాబ్ మార్కులు తగ్గిస్తామని బెదిరింపులు
గాంధీ ఆసుపత్రిలో ట్రైనీ విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న నలుగురు పెథాలజీ లాబ్ టెక్నిషియన్స్ ను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కులు తక్కువ వేస్తామని బెదిరించి కొన్నేళ్లుగా ట్రైనీ అమ్మాయిలను లొంగదీసుకుంటున్న నీచ్ కమీనే గాళ్ళను రిమాండ్ కు తరలిస్తున్నట్టు నార్త్ జోన్ డిసిపి సుమతి తెలిపారు.
మీరు చూస్తున్న వీళ్ళంతా గాంధీ ధర్మాసుపత్రిలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన కామాంధులు. వీళ్ల పేర్లు మహ్మద్ అక్రమ్, ఆంథోనీ సెబాస్టియన్, మధుబాబు, మండలం దుర్గాదాస్. చేతిలో కొద్దిపాటి మార్కులు ఉండటంతో కొన్నేళ్లుగా వీళ్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ట్రైనీ డాక్టర్లకు లాబ్ పరీక్షల్లో మార్కులు వేయాలంటే వారు చెప్పినట్లు వినాల్సిందే.
లేడీ ట్రైనీ డాక్టర్లను పట్టుకోవటం, లైంగిక వేధింపులకు గురిచేయటం, లొంగదీసుకోవటంలో వీరంతా సిద్ధహస్తులు. ఇలా కొన్ని సంవత్సరాలుగా గాంధీ ఆస్పత్రి పెథాలజీ లాబ్ లలో అరాచకాలు చేస్తున్నారు. మూడు నెలల క్రితం కొంత మంది మహిళా ట్రైనీ డాక్టర్లు గాంధీ సూపరిండెంట్ కు ఫిర్యాదు చేశారు. కమిటీ వేసిన అధికారులు వాస్తవాలను వెలికితీసి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిలకలగూడ పోలీసులు ఈ నలుగురు లాబ్ టెక్నిషియన్స్ ను అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు నార్త్ జోన్ డిసిపి సుమతి తెలిపారు. లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలు ఎవరూ భయపడొద్దని, అధైర్యపడొద్దని వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసినవారి సమాచారం గోప్యంగా ఉంచుతామని నార్త్ జోన్ డిసిపి సుమతి చెప్పారు.