రియల్‌ బాహుబలి...ప్రాణాలకు తెగించి అడవి పందితో పోరాడిన రైతు

Update: 2018-07-23 07:38 GMT

ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ గిరిజనుడు బాహుబలిలా విరుచుకుపడి అడవి పందిని మట్టికరిపించాడు. బోథ్‌ మండలం సంపత్‌నాయక్‌ తండాలో తన పత్తి పంటను పరిశీలించేందుకు వెళ్లిన రైతు కటక్వార్‌ జైసింగ్‌‌పై సడన్‌గా అడవి పంది దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన జైసింగ్‌ అడవి పంది నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అడవి పంది పదేపదే రైతుపై విరుచుకుపడటంతో మరో దారిలేక తిరగబడ్డాడు.

రైతు జైసింగ్‌ అడవి పంది మధ్య కొద్దిసేపు హోరాహోరీ పోరు జరిగింది. తీవ్ర గాయాలతో రక్తం కారుతున్నా భీతిల్లికుండా అడవి పందితో పోరాడాడు. చివరికి అడవి పంది మెడను దొరకబట్టుకొని పట్టువదలకుండా గట్టిగా నొక్కి  పట్టుకోవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్ర గాయాలపాలైన రైతును గమనించిన స్థానికులు అతడ్ని ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. భయపడకుండా అడవి పందితో పోరాహోరీ పోరాడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న జైసింగ్‌ ధైర్యసాహసాలను స్థానికులు ప్రశంసిస్తున్నారు.

Similar News