ఈశాన్య భారతంలో మూడు రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారాన్ని కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట త్రిపురపై కన్నేసింది. అంతేకాదు త్రిపురలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది. మొత్తంగా సీపీఎం, బీజేపీ ముఖాముఖి తలపడిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠ రేపుతోంది. నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న మాణిక్ సర్కార్ కోటకు బీటలు తప్పవని ఎగ్జిట్పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఎర్రజెండా రెపరెపలాడుతున్న త్రిపురలో కమలనాథులు తొలిసారిగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ లెక్కలు కట్టాయి.
తాజా ఎన్నికల్లో IPFT వంటి స్థానిక పార్టీలతో జట్టుకట్టిన బీజేపీదే అధికారమని న్యూస్ఎక్స్-జన్కీ బాత్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. న్యూస్ఎక్స్-జన్కీ బాత్ సర్వే... BJP-IPFT కూటమికి 31 నుంచి 37 సీట్లు, CPMకు 14 నుంచి 23 స్థానాలు వస్తాయని తెలిపింది. యాక్సిస్-మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. BJP-IPFT కూటమికి 45 నుంచి 50 సీట్లు, అధికార CPMకు 9 నుంచి 10 సీట్లు వస్తయని లెక్క తేల్చింది. సీ ఓటర్ ఎగ్జిట్పోల్ మాత్రం సీపీఎం, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని అంటోంది. సీ ఓటర్ సర్వే CPMకు 26 నుంచి 34 సీట్లు, BJP-IPFT కూటమికి 24 నుంచి 32 సీట్లు వస్తాయంటోంది. 2013లో మొత్తం 60 అసెంబ్లీ సీట్లకు గానూ 49 స్థానాలతో సీపీఎం విజయఢంకా మోగించగా కాంగ్రెస్ పది సీట్లు సంపాదించుకుంది.