జి. వెంకట స్వామి కుటుంబం మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత గడ్డం వినోద్ కాంగ్రెస్లో చేరడం ఖాయమైనట్లు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో రెండ్రోజుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిన్న తన అనుచరులతో సమావేశమైన వినోద్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నూర్ టికెట్ ఇవ్వకపోవడంతో అలకబూనిన వినోద్ మాజీ మంత్రినైన తనకు టీఆర్ఎస్లో కనీస గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తన తమ్ముడు, ప్రభుత్వ సలహాదారు వివేక్ పార్టీ మారే విషయం తనకు తెలియదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా, కాంగ్రెస్ నుంచి చెన్నూర్, లేదా బెల్లంపల్లి టికెట్ను వినోద్ ఆశిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వ సలహాదారు వివేక్ శనివారం మంత్రి కేటీఆర్ను ప్రత్యేకంగా కలిశారు. కాగా, ఎన్నికల్లో కలిసి పని చేయాలని మంథని అభ్యర్థి పుట్ట మధు, అసమ్మతి నేత చందుపట్ట సునీల్రెడ్డికి కేటీఆర్ సూచించారు.