తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కెల్విన్ బెయిల్ పై విడుదలయ్యాడు. హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్ పాపాల పుట్టను బద్దలు కొట్టేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటుచేసిన ప్రత్యేక అధికారుల బృందం (సిట్) నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో సినీ రంగం, రాజకీయనేతలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే అనుమానంతో బోయిన్పల్లికి చెందిన కెల్విన్ వాడిన మొబైల్ ఫోన్లో ఉపయోగించిన కోడ్ భాషలను డీకోడ్ చేశారు. ఈ డీకోడ్ ఆధారంగా కెల్విన్ ను అదుపులోకి తీసుకున్న ఎైక్సెజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేపథ్యంలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా కెల్విన్ నుంచి మూడు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులకు వాటిలో 2,500కు పైగా కాంటాక్టులు లభించాయి. వాటిలో 100కు పైగా మొబైల్ నెంబర్లు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులవేనని పోలీసులు గుర్తించారు.
ఈ మొబైల్ నెంబర్ల ఆధారంగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ , హీరోయిన్ ఛార్మీ, మొమైత్ ఖాన్ ,సుబ్బరాజు, కెమెరామ్యాన్ శ్యాం కే నాయుడు , హీరో రవితేజ,ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, నవదీప్ , తరుణ్ , తనీష్ , నందులకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీచేసారు. వీరిని సిట్ విచారణకు రావాలని ఆదేశించారు. అయితే నోటీసులతో విచారణకు హాజరైన టాలీవుడ్ ప్రముఖులు కెల్విన్ తో తమకు సంబంధంలేదని తెలిపారు. దీంతో కేసు విచారణ చేపట్టిన సిట్ అధికారులు కేసును లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా కేసులో కీలక నిందితుడు కెల్విన్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో డ్రగ్స్ రాకెట్ కేసు లో చర్లపల్లి జైలులో ఉన్న కెల్విన్ విడుదలయ్యాడు.