ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ రెడీ ఉందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ శ్రేణులను టీఆర్ఎస్ బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తోందన్న జానా రేవంత్రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. డీ-లిమిటేషన్పై కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా అభ్యంతరం లేదన్న జానారెడ్డి డీలిమిటేషన్ జరగదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రయత్నాలు సహజమన్న ఆయన ఆలాంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందన్నారు. మహాభారతంలో ఎక్కువ అస్త్రాలు, సైన్యం కౌరవుల వద్దే ఉన్నప్పటికీ పాండవులే విజయం సాధించారని చెప్పారు. కాంగ్రెస్ శ్రేణులను బలహీనపరిచే ప్రయత్నం చేసినా ప్రజాభిప్రాయం తమ వైపే ఉందన్నారు.
రేవంత్రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడన్న జానారెడ్డి రేవంత్కంటే ముందు రాజీనామా చేసిన ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించలేదన్నారు. రేవంత్రెడ్డి రాజీనామా లేఖను పెండింగ్లో పెడతారన్న ఉద్దేశ్యంతో ఆగాడన్నారు. ముందు ఇచ్చిన వారి రాజీనామాలు ఆమోదించిన వెంటనే రేవంత్ రాజీనామా లేఖను స్పీకర్కు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పారు.
రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో మాత్రమే రెండు పంటలు రైతులు వేస్తున్నారన్న జానా ఇందులో 62శాతం మంది రైతులకు రెండున్నర ఎకరాల భూమి ఉందన్నారు. మెజార్టీ రైతులకు రెండు నుంచి 3వేల రూపాయలలోపే పెట్టుబడి సాయం అందుతుందన్నారు. రైతులు వేసిన పంటలకు గిట్టుబాటు ధర, బోనస్ ఇస్తే న్యాయం జరుగుతుందన్నారు.