దశాబ్దాల చరిత్రగల కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరం నేతృత్వంలో సంచలన నిర్ణయం ప్రకటించింది. పార్టీ ఎదురుకుంటున్న ఆర్ధిక కష్టాల నేపథ్యంలో ప్రజలవద్ద చెయ్యిచాచి అడగాలని నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఆర్ధికంగా ఎదురీదుతోందని ఏడీఆర్(Association for Democratic Reforms) నివేదిక తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రజలనుంచి ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టాలని భావించింది. దీంతో అధికారిక ట్విట్టర్ ద్వారా దీనిపై పోస్ట్ చేస్తూ.. 'కాంగ్రెస్కు మీ సహకారం, మద్ధతు అవసరం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటే మాకు సాయం చెయ్యండి. మీకు తోచినంత సాయం చెయ్యండి' అంటూ ట్వీట్లో పేర్కొంది. కాగా ఈ కార్యక్రమంపై ముందస్తుగానే నటి రమ్య(కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి) ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపడుతున్నామని ట్వీట్ చేసింది. అంతేకాదు ఈ నిర్ణయం పట్ల కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ స్పందించారు.. నిధుల సమస్యతో బాధపడుతున్న కాంగ్రెస్ ప్రజల సహకారం కోరటం తప్పని భావించటం లేదు. ఎందుకంటే బీజేపీ డబ్బు రాజకీయాలను ఎదుర్కోవాలంటే అది తప్పనిసరి అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.