ప్రపంచ దేశాలు అభివృద్ధి దిశలో పయనించేలా.. ప్రపంచ ఆర్థిక సదస్సు దోహదపడుతుందన్నారు ప్రధాని మోడీ. 20 ఏళ్లలో ప్రపంచం ఎంతో మారిపోయిందన్న ఆయన.. భారత ఆర్థిక వ్యవస్థలోనూ ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఇండియాలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు పెరిగాయన్నారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో.. ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. 1997లో అప్పటి ప్రధాని దేవెగౌడ తర్వాత.. మళ్లీ 20 ఏళ్లకు ప్రపంచ ఆర్థిక వేదికపై భారత ప్రధాని తొలిసారి ప్రసంగించారు. టెక్నాలజీ అభివృద్ధితో.. ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు మోడీ.
1977లో 400ల బిలియన్ డాలర్లుగా ఉన్న ఇండియా జీడీపీ.. ఇప్పుడు 6 రెట్లు పెరిగిందన్నారు మోడీ. భారత్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు పెరిగాయని.. తన ప్రసంగం ద్వారా ప్రపంచ దేశాలకు చెప్పారు ప్రధాని. ఇంటర్నెట్, బిగ్ డేటాలతో.. ప్రపంచమంతా అనుసంధానమవుతోందన్నారు. మన మాట, పని, అన్ని విషయాలను టెక్నాలజీయే ప్రభావితం చేస్తోందని చెప్పారు. సైబర్ టెక్నాలజీ.. చెడుకు వినియోగించకుండా నిరోధించడమే ఇప్పుడు అసలైన సవాల్గా మారిందన్నారు నరేంద్ర మోడీ.
మన సుఖం కోసం ప్రకృతిని ధ్వంసం చేయొద్దని మోడీ సూచించారు. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు.. విశ్వం మనుగడకు సవాల్గా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని మోడీ మరోసారి చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న మరో తీవ్రమైన సమస్య ఉగ్రవాదమని, యావత్ ప్రపంచానికి పెను సవాళ్లు విసురుతోందన్నారు. ప్రపంచ ఆర్థిక ప్రగతిలో మరింత క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.