దూకుడు పెంచిన తెలంగాణ సీఎం కేసీఆర్‌...కీల‌క నేత‌లంద‌రికీ ముంద‌స్తు సంకేతాలు...

Update: 2018-07-30 07:24 GMT

ముందస్తు ఎన్నికలు వస్తే థీటుగా ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ దూకుడు పెంచాడు.  పార్టీ ప్రచార ఆయుధాలకు పదును పెడుతున్నారు. ఓ వైపు పక్క అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారిస్తూనే మరోవైపు చైతన్య పరిచే పాటలను రాయిస్తున్నారు.  ఇప్పటికే  ఎన్నికల పర్యవేక్షణ బాధ్యలను సీనియర్లకు అప్పగించగా  ముందస్తుకు వెళితే కలిగే లాభనష్టాలపై బేరీజులు వేసుకుంటున్నారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముందస్తు కసరత్తులో బిజీగా ఉన్నారు. ముందస్తు ఎన్నికలపై ఇక క్లారిటీ రానప్పటికి పక్కా ప్లాన్‌తో రంగంలో దిగేందుకు స్కెచ్‌లు వేస్తున్నారు.  ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచడంతో పాటు కీల‌క నేత‌లంద‌రికీ ముంద‌స్తు సంకేతాలు అందించి అందుకు త‌గ్గట్లుగా ప‌క్కా వ్యూహం ర‌చించాలని సూచనలు ఇస్తున్నారు. 
 
ఆగస్టులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన తర్వాత అసెంబ్లీని రద్దు చేస్తే మ‌ధ్యప్రదేశ్‌, రాజ‌స్తాన్‌, చ‌త్తీస్‌ఘ‌డ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటు తెలంగాణ‌లోనూ ఎన్నికలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అందుకే  పార్టీ యంత్రాంగాన్నంత ముందస్తుకు రెడీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు  ఏ మేర నేరవేరాయి ప్రభుత్వ పనితీరుపట్ల ప్రజలు ఎంత మేర సంతృప్తిగా ఉన్నారని  గులాబి క్యాడర్‌పై ప్రజలేమంటున్నారు విపక్షాలను ఎదుర్కొనేందుకు ఎలాంటి కౌంటర్లు ఇవ్వాలన్న అంశాలపై  చర్చిస్తున్నారు.

ఇక పార్టీ జెండాలు, కరపత్రాలు, బుక్‌లెట్లు, ప్రచార రథాలను రెండు నెల్లో  సిద్ధం చేయాలని సూచనలు ఇస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమ సందర్భంగా పాటలు కీలక పాత్ర పోషించిన దృష్ట్యా అదే స్థాయిలో పథకాలపై పాటలను రూపొందించాలని సంకేతాలు అందజేసినట్లు తెలిపారు. ఇక ఎన్నిక‌ల వేళ కేసీఆర్ కొంత‌మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను, మంత్రుల‌ను ఎంపీలుగా పోటీ చేయించే ఛాన్సులు ఉన్నట్టు కూడా టీఆర్ఎస్ వ‌ర్గాల్లో జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. ఎన్నిక‌ల హీట్ స్టార్ట్ అయిన వెంట‌నే కేసీఆర్ ఇచ్చే ట్విస్టులు మామూలుగా ఉండ‌వ‌న్నదే తెలంగాణ పాలిటిక్స్‌లో వినిపిస్తోన్న హాట్ టాపిక్‌.
 

Similar News