దేశంలో ఎక్కడా లేని విధంగా కంటివెలుగు పథకాన్ని ప్రారంభించామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. 3 కోట్ల 70 లక్షల మందికి పరీక్షలు చేసేందుకు 825 టీఎంలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో కరెంట్, మంచినీటి సమస్యలను అధిగమించామన్న కేసీఆర్ మల్కాపూర్ గ్రామానికి 6 కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
దేశంలోనే తొలిసారి కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామన్న కేసీఆర్ సిద్దిపేట జిల్లా మల్కాపూర్లో కంటి వెలుగు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 3 కోట్ల 70 లక్షల మందికి కంటి పరీక్షలు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ కాటరాక్టు పరీక్షలు కూడా ఉచితంగా చేస్తామన్నారు. 40 లక్షల కళ్లద్దాలు తీసుకొచ్చామన్న కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్షలు చేసేందుకు 825 టీంలు పని చేస్తున్నాయని చెప్పారు.
కరెంట్, మంచినీళ్లు సమస్యలు అధిగమించామన్న కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల కోసం 60వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. మిషన్ కాకతీయ పథకం కింద చెరువులన్ని బాగు చేశామన్న ఆయన... చెరువులన్ని 365 రోజులు కళకళలాడేలా చేస్తామన్నారు.
దేశంలో ఆడ, మగ అన్న లింగ వివక్ష ఉందన్న కేసీఆర్....అవకాశం వస్తే మహిళలు కూడా అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. రష్యాలో విమానం నడిపే వారిలో 92 శాతం మంది మహిళలేనన్నారు. వచ్చే జూన్ నాటికి మల్కాపూర్ గ్రామానికి గోదావరి నీళ్లు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మల్కాపూర్ గ్రామాన్ని చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్న కేసీఆర్ గ్రామాభివృద్ధి కోసం 6 కోట్లు మంజూరు చేశారు.