నేటి నుంచి రైతుబీమా అమలు

Update: 2018-08-15 08:42 GMT

తెలంగాణ ప్రగతి పథంలో ప్రయాణిస్తుందని, సంక్షేమ రంగంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు సీఎం కేసీఆర్. గొల్కోండ జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని, జాతీయ జెండా ఎగురవేశారు. బ్యాంకులతో సంబంధంలేకుండా బీసీలకు నేరుగా లోన్స్ ఇస్తున్నట్లు తెలిపారు.  నేటి నుంచి రైతు బీమా పథకం అమలు చేస్తున్నామని, రెండో విడత రైతు బంధు పథకం చెక్కులు నవంబర్ లో ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 

హైదరాబాద్ లోని చారిత్రాత్మక గొల్కోండ కోటలో 72వ స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. సీఎం కేసీఆర్ మువ్వన్నెల జెండా ఎగురవేసి పోలీస్ వందనం స్వీకరించారు.  స్వరాష్ట్రంలో చారిత్రాత్మకమైన గోల్కొండ  కోట మీద వరుసగా ఐదోసారి జాతీయ పతాకాన్ని  ఎగురవేస్తున్నందుకు గర్విస్తున్నాను అని కేసీఆర్ చెప్పారు. అతి తక్కువ కాలం లోనే  అనూహ్యమైన ప్రగతిని సాధించి తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. 

భూ సర్వేతో రైతుల వేధిస్తున్న సమస్యలు పరిష‌్కరించాం అని చెప్పిన కేసీఆర్ రైతుల పంటల పెట్టుబడి కోసం రైతు బంధు పథకం ప్రవేశపెట్టమన్నారు. నవంబర్ లో రైతుబంధు రెండో విడత చెక్కుల పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. నేటి నుంచి రైతులకు భీమా పథకం ప్రారంభించి దేశంలోనే తెలంగాణ కొత్త చరిత్ర సృష్టిస్తోంది అని చెప్పారు. 

సమైక్య రాష్ట్రంలో తెలంగాణా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విచ్చిన్నమై పోయింది. కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే బీ సి కులాల జీవితాలు కుప్ప కూలి పోయినాయి అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వెనుబడినవర్గాల అభివృద్ధి కోసం  బ్యాంక్ లతో సంబంధం లేకుండా ప్రభుత్వం నేరుగా రుణాలు ఇస్తుందని చెప్పారు. దేశంలో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేక గుర్తింపు పొందిందని కేసీఆర్ తెలిపారు. 40వేల కోట్ల రూపాయలతో 40కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణా ప్రజా సంక్షేమంలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా  నిలిచిందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను వల్లెవేసిన ముఖ్యమంత్రి నవంబర్ నుంచి హైదరబాద్ లో రెండో దశ మెట్రో రైలు ప్రారంభం అవుతుందని తెలిపారు. గొల్కోండలో జరిగిన పంద్రాగస్టు వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. 
 

Similar News