తనది థర్డ్ ఫ్రంట్ కాదు.. ఫెడరల్ ఫ్రంట్ అని ప్రకటించిన కేసీఆర్.. భవిష్యత్ ప్రణాళిక ఏంటి..? జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపగల నేతలతో చర్చించేందుకు తగు ప్రణాళికలు సిద్ధమయ్యాయా..? కోల్కతా తర్వాత నెక్ట్స్ టూర్ ఎటువైపు..? బీజేపీ, కాంగ్రెస్ కాని కూటమితో వస్తున్నానన్న కేసీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి..?
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకు సంబంధించి విధానాలు రూపొందించే పనిలో పడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో భాగంగా రెండు రకాల సిద్ధాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ రెబల్ నేత యశ్వంత్ సిన్హా మోడల్తో పాటు విపక్షాలను ఏకం చేసే విధంగా జయప్రకాశ్ నారాయణ అనుసరించిన సంపూర్ణ క్రాంతి సిద్ధాంతాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగునంగా మార్పులు చేసి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రాంతీయ పార్టీల మధ్య విభేదాలు తలెత్తకుండా విపక్షాలన్నింటిని ఒకే తాటి మీద నిలపేందుకు ఉపకరిస్తుందన్న చర్చ జాతీయ రాజకీయాల్లో నెలకొంది. అందుకే యశ్వంత్ మోడల్ ను కేసీఆర్ అధ్యయనం చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల అధినేతలను ఆయా రాష్ట్రాలకు కన్వీనర్ గా నియమించటంతో పాటు ఫ్రంట్ కన్వీనర్ ను ఎలా నియమించాలో యశ్వంత్ సిన్హా మెడల్ లో రూపొందించినట్లు తెలుస్తోంది. ఫ్రంట్ కు కన్వీనర్ గా నియమించాలనుకునే వ్యక్తికి ప్రధానమంత్రి కావాలనే కోరికలు ఉండకూడదనే నిబందన కూడా సిన్హా మాడల్ లో ఉంది. దీంతో పాటు ఎన్నికలకు ముందే ప్రధానమంత్రి అభ్యర్థిని ఎలా ఎంపిక చేయాలనేదానిపై కూడా స్టడీ చేస్తున్నారు.
అంతేకాకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పలు రాష్ట్రాలకు చెందిన నాయకులతో ఫోన్ లో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే త్వరలోనే కేసీఆర్ వివిద రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశమైనట్లు తెలుస్తోంది. డీఎంకే నేతలు కనిమొళి, రాజాతో నిజామాబాద్ ఎంపీ కవిత ఢిల్లీలో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపి ప్లాట్ ఫామ్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. దీంతో వీలైనంత త్వరగా ఢిల్లీకి వెళ్లి ఆయా నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇలా చర్చలు జరపడమే కాకుండా ఈ నెల 27 న జరిగే టీఆర్ఎస్ ఆవిర్బావ దినోత్సవ సభకు ఫ్రంట్ కు సహకరించే నేతలందరిని పిలిచి.. అదే వేదికపై నుంచి జాతీయ శంఖారావం పూరించాలని ఉవ్విల్లూరుతున్నారు గులాబి బాస్. అందుకు తగు ప్రణాళికలు రచించే పనిలో పడ్డారు ఆ పార్టీ నేతలు.