ఎన్నిక‌ల ప్ర‌చారంలో చిరంజీవి

Update: 2018-02-15 07:55 GMT

త్వరలో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికలు బీజేపీకి, ప్రధాని మోదీకి అత్యంత కీలకమైనవి. ఈ ఎన్నికల ఫలితాలు 2019లో జరగబోయే సాధారణ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో గెలవడానికి సర్వశక్తులు ఒడ్డబోతున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో పర్యటించి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఇప్పటికే కర్ణాటకలో ఓ ర్యాలీ నిర్వహించారు.

ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ఎన్నో ప్రాంతాల్లో భారీ సంఖ్యలో అభిమానులను కలిగి ఉన్న కాంగ్రెస్ నేత, మెగాస్టార్ చిరంజీవిని ఎన్నికల ప్రచారంలోకి దింపనుంది కాంగ్రెస్. దీనిపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) కార్యాధ్యక్షుడు దినేష్ గుండూరావు మాట్లాడుతూ, కనీసం వారం రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చిరంజీవి అంగీకరించారని చెప్పారు. సినీ నటి ఖుష్బూ కూడా ప్రచారం చేస్తారని తెలిపారు. ప్రియాంక గాంధీని కూడా రప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని... అయితే, ఇంతవరకు స్పష్టమైన హామీ రాలేదని చెప్పారు. మతోన్మాదమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్న బీజేపీ దూకుడుకు ఈ ఎన్నికల్లో బ్రేక్ వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
 

Similar News