పెళ్ళై నెలరోజులైనా కాలేదు నవవధువుకు కష్టాలు మొదలయ్యాయి. ప్రేమించిన ప్రియురాలితో భర్త వెళ్లిపోవడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలూకా ఆర్కేపేట మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే ఆర్కేపేట మండలంలోని తామనేరి గ్రామానికి చెందిన సంపత్రెడ్డి, నిశ్చల దంపతుల కుమార్తె అర్చనదేవి (21)కి. వేలూరు జిల్లా నెమిలి సమీపంలోని పుధూరు గ్రామానికి చెందిన తంగరాజ్తో నెల రోజుల కిందట వివాహం జరిగింది. తంగరాజ్ ఇంజనీర్ గా పనిచేసేవాడు.
ఎన్నో చిగురాశలతో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన అర్చనదేవి జీవితంలో భర్త నిప్పులు పోశాడు. వివాహమైన నెల రోజుల్లోనే తంగరాజ్ ప్రియురాలితో కలసి పరారయ్యాడు. దీంతో మనస్థాపం చెందిన అర్చనదేవి. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లి మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.