బిట్కాయిన్. ఈమధ్యకాలంలో ఈ కొత్త డిజిటల్ కరెన్సీ పేరు బాగా వినపడుతోంది. ముఖ్యంగా మనదేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత, దీని వాడకం పెరిగింది. అంతర్జాతీయ మారకంగా అనధికారికంగా చలామణి అవుతున్న ఈ బిట్కాయిన్ గురించి ఎవరికీ పెద్దగా నాలెడ్జ్ లేదు. కానీ ప్రతిరోజు దీని విలువ వేలకు వేలు పెరుగుతుండటంతో, చాలామంది దీన్ని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. భూములు, బంగారం కొని, లాభపడుతున్నట్టుగానే, బిట్కాయిన్లనూ కొంటున్నారు. అయితే ఈమధ్య బిట్కాయిన్ పేరుతో జరుగుతున్న మోసాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో బిట్కాయిన్ల పేరుతో, ఓ రాజకీయ నాయకుడు తమను మోసం చేశారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం బల్లవరానికి చెందిన రామకృష్ణారెడ్డి....కనిగిరిలో బిట్కాయిన్ కాల్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నించి, పోలీసుల రంగప్రవేశంతో మానుకున్నాడు. అయితే చెన్నై కేంద్రంగా మళ్లీ బిట్కాయిన్ దందా మొదలుపెట్టాడు. బిట్ కాయిన్ ఇండియా సాఫ్ట్వేర్ సర్వీసెస్ లిమిటెడ్ పేరుతో..వివిధ ప్రాంతాల ప్రజల నుంచి ఆన్లైన్ ద్వారా బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టించాడు రామకృష్ణారెడ్డి. అందుకు కమీషన్ తీసుకొని....ఈ నెల మొదటి వారంలో ఆన్లైన్ ట్రేడింగ్ ఆపేశారు.
పెట్టుబడి పెట్టినవారు దీనిపై లోతుగా ఆరా తీస్తే...ఇండియాలో బిట్ కాయిన్ ఆర్థిక విధానాలను కేంద్రం అనుమతించడం లేదని తెలిపాడు. ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోందని కొన్నాళ్లు ఆగాలని చెప్పి....ఆ తర్వాత ఫోన్ను స్విచ్ఛాప్ చేశాడు. దీంతో నోయిడాకు చెందిన సుమిత్ అతని స్నేహితులు మోసపోయామన్న అనుమానంతో ఢిల్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేల మంది నుంచి 200 కోట్లు వరకు వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. రామకృష్ణారెడ్డి బాధితులు ఢిల్లీ సైబర్ వింగ్ పోలీసులతోపాటు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఫిర్యాదు చేశారు.
రామకృష్ణా రెడ్డి వైసీపీ తమిళనాడు విభాగం సేవాదళ్కు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఒక వైపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే....మరోవైపు ఉద్యోగాల పేరుతో సంస్థలు ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
బిట్కాయిన్ మోసాలు అలా ఉంటే, ఎలాంటి యంత్రణలేని ఈ క్రిప్టో కరెన్సీ, మార్కెట్లను షేక్ చేస్తోంది. ఆసియాలో వర్చువల్ కరెన్సీ విలువ 10,379 డాలర్లకు చేరింది. అంటే మన కరెన్సీలో ఒక్కో బిట్కాయిన్ విలువ 6,68,355 రూపాయలన్నమాట. నవంబర్లో ఏకంగా 9,771 డాలర్ల ఆల్టైమ్ హైకి చేరి రికార్డు సృష్టించిన బిట్కాయిన్, ఇప్పుడు దాన్ని తిరగరాసేలా 17 వేల డాలర్లకు చేంది. మన కరెన్సీలో దీని విలువ దాదాపు 10 లక్షలకు పైగానే. మరో ఏడాదిన్నరలో బిట్కాయిన్ ధర 50వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు చేరినా, ఆశ్చర్యంలేదని నిపుణులు అంటున్నారు.