భారత మాజీ ప్రధాని, రాజకీయ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్పేయి(93) కన్నుమూశారు. కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో యావత్ దేశ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. నిత్యం ప్రజలు, ప్రజాస్వామ్యం అంటూ తహతహలాడే గొంతు మూగబోవడంతో రాజకీయ నేతలు, అటల్ అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. అటల్ బిహారీ వాజపేయి 1924 మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి మరియు కృష్ణబిహారీ వాజపేయి. ఆయన తాత పండిట్ శ్యాం లాల్ వాజపేయి వారి పూర్వీకుల నివాస ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ లోని బటేశ్వర్ నుండి గ్వాలియర్ లోని మొరీనాకు వలస వెళ్ళారు. ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చిన వాజపేయి.. పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని జీవితాంతం గడిపారు. ఒకానొక సమయంలో మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడగగా.. దానికి పెళ్ళి చేసుకునే తీరిక తనకు లేదన్నారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) స్థాపించడంలో ముఖ్య భూమిక పోషించారు. ఆ తరువాత బీజేపీ ప్రభుత్వం రావడంలోను కీలక పాత్ర పోషించారు. మొదటిసారిగా రెండవ లోక్సభకు ఎన్నికైన అయన. మధ్యలో 3 9వ లోక్సభలకు తప్పించి 14వ లోక్ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికై ప్రజాసేవ అందించారు. ఆయనకు 50 ఏళ్ళు వయసులో దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు వాజపేయి ని భావి భారత ప్రధానిగా అభివర్ణించారు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999లో 13వ లోక్సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. కాగా అటల్జీ బాగా వంటలు చేసేవారట. వాజ్పేయ్ తండ్రికి బయటి భోజనం ఇష్టం లేకపోవడంతో తన తండ్రితో కలిసి ఉండేటప్పుడు తనే స్వయంగా వంట చేసి తండ్రికి వడ్డించేవారు. కిచిడీ, పూరి కచోరీ, దాల్–పకోరీ, పాంథ, ఖీర్ , మాల్పావ్, కచోరీ, మంగౌరీ వంటకాలు వాజ్పేయ్కి అత్యంత ఇష్టమైన వంటకాలు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గానూ భారత ప్రభుత్వం డిసెంబర్ 24, 2014లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది.