అటల్‌జీకి ఇష్టమైన పుల్లారెడ్డి..

Update: 2018-08-17 11:21 GMT

మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇకలేరనే వార్త విషాదాన్ని నింపింది. రాజకీయా, క్రీడా, సినిమా, వ్యాపార రంగాల్లోని ప్రముఖులంతా ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయనతో ఉన్న మధుర క్షణాలను నెమరు వేసుకుంటున్నారు. ఇక ఆయనతో ప్రత్యేక అనుబంధం కలిగిన సికింద్రాబాద్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వాజపేయి తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 1984లో వాజ్‌పేయి రాష్ట్ర పర్యటనకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఢిల్లీ వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా వస్తుందని అధికారులు సమాచారం అందించారు. దాంతో దారిలోనే ఉన్న పుల్లారెడ్డి గారింటికి వెళదామా అని అడిగేసరికి.. ఓ మిఠాయిల పుల్లారెడ్డిగారా పదండి పదండి అన్నారు. అలా రెడ్డిగారి ఇంటికి వెళితే అయన ఆప్యాయంగా పెట్టిన స్వీట్లను మహాఇష్టంగా తిన్నారు వాజ్‌పేయి. అప్పట్నుంచి నేను వాజపేయి కి ఢిల్లీలో ఎప్పుడు కనిపించినా ఏమయ్యా దత్తాత్రేయా పుల్లారెడ్డి స్వీట్లు తెచ్చావా అంటూ ఆశగా పలకరించేవారు. పుల్లారెడ్డి స్వీట్స్ కోసం ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ అడిగి తెప్పించుకునేవారు అని ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు బండారు దత్తాత్రేయ. 

Similar News