ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. ప్రభుత్వం యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతం మంగళగిరిని మైటెక్ సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్న ఐటీ మంత్రి నారాలోకేష్ నేడు 16ఐటీ కంపెనీలు ప్రారంభించనున్నారు.
ఈ కంపెనీల ద్వారా ఇప్పటికిప్పుడు 600 మందికి ఉపాధి అవకాశాలు లభించనుండగా ఏడాదిలోపు మరో 1600 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మంగళగిరి ఆటోనగర్ ప్రాంతంలో ఇప్పటికే మూడు ఐటీ కంపెనీలు పనిచేస్తుండగా వీటిలో 500 మంది పనిచేస్తున్నారు.
గుంటూరు విద్యానగర్లో ఐటీలో పరిశోధన కోసం ‘వేద ఐఐటీ’ అనే సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఐటీ సంస్థలకు అనుబంధంగా గన్నవరంలోని మేధా టవర్స్లో స్టేట్ సాఫ్ట్ ఫైనాన్స్ కామర్స్ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంస్థ ఇప్పటికే 250 మంది కామర్స్ పట్టభద్రులకు శిక్షణ ఇస్తోంది. అలాగే మంగళగిరిలో నిర్వహిస్తున్న వర్క్ షాపునకు 2 వేల మంది విద్యార్థులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఐటీ అభివృద్ది, శిక్షణ, ఉపాధి అవకాశాలపై మంత్రి లోకేశ్ విద్యార్థులకు వివరించనున్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటీలా మంగళగిరిలోని ఐటీ ప్రాంతం మైటెక్ సిటీగా అభివృద్ధి చెందుతుందని ఏపీ ఎన్ఆర్టీ సీఈవో రవి వేమూరి తెలిపారు.