ఏపీ రాజధాని అమరావతికి రూపురేఖలు రానున్నాయి. రాజధాని నిర్మాణం ఇకపై ఊపందుకోనుంది. నిన్నమొన్నటిదాకా భూ సేకరణ, డిజైన్ల ఎంపికకే పరిమితమయిన రాజధాని నిర్మాణం.. ఇక వేగవంతం కానుంది. ముఖ్యంగా త్వరలోనే అమరావతి ఎంట్రన్స్ను పూర్తి చేయాలని సంకల్పించింది చంద్రబాబు సర్కార్. ఆ డిజైన్లు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. అవి పూర్తి అయితే చంద్రబాబు కలలు కంటున్న ప్రపంచ స్థాయి రాజధానికి బీజం పడనుందట. తాజాగా రిలీజ్ అయిన ఆ డిజైన్లు అందరి మదిని తొలుస్తున్నాయి.ఈ ఎంట్రన్స్ను విజయవాడను ఆనుకొని ఉన్న కృష్ణా నదిపై ఉన్న వారధి నుంచే మొదలు కానుందట. ఇది సుమారు 2.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండనుంది. ఇది బౌద్ధమతానికి పవిత్రమైనదిగా భావించే ధర్మచక్రంను ఆదర్శంగా తీసుకొని నిర్మిస్తున్నారు. దీనికోసం ఎన్నో డిజైన్లను పరిశీలించి ఫైనల్గా దీనికి ఓకే చేసింది ఏపీ ప్రభుత్వం.
అమరావతి నిర్మాణం కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట ఓ కొత్త సంస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ముఖద్వారం నిర్మాణ బాధ్యతలను దీనికే అప్పగించింది. దీనికోసం ఇప్పటికే 6 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కేవలం ఆకృతిలోనూ కాకుండా, సైజ్లోనూ అది భారీగా ఉండనుంది. ఈ ధర్మచక్రం ఏపీ రాజధాని ఎంట్రన్స్గా నిలవనుందట. కేవలం ధర్మచక్రంతోనే సరిపెట్టకుండా దాని చుట్టూ పచ్చికబయళ్లనూ తీర్చిదిద్దనున్నారు. ఈ నిర్మాణం ఈ ఏడాది ఏప్రిల్లోనే పూర్తి కానుందట. దీంతో, సమ్మర్ నాటికి దీనిని చూడడానికే అమరావతికి పర్యాటకులు భారీగా తరలివచ్చేలా ఏర్పాటు చేస్తున్నారట అధికారులు.ఇదే ఊపులో మిగిలిన డిజైన్లను కూడా ఫైనలైజ్ చేసి… రాజధాని నిర్మాణానికి మరింత ఊపు తేనున్నారని సమాచారం. అదే జోష్తో శాసనసభ, హైకోర్ట్, గవర్నర్ నివాసమైన రాజ్భవన్ను కూడా ఫైనలైజ్ చేయాలని సంకల్పిస్తున్నారు చంద్రబాబు. మరి, అమరావతి ఎంట్రన్స్ డిజైన్లను చూస్తేనే అర్ధం అవుతుంది ఏపీ ప్రజల కలల రాజధాని ఏ రేంజ్లో ఉండబోతోందో….