బుల్లితెరపై క్రేజ్ ఉన్న యాంకర్లలో శ్యామల ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె క్రమేణా అందివచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకొని ఇప్పుడు స్టార్ యాంకర్ గా చలామణి అవుతున్నారు. ప్రీ రిలీజ్ వేడుకలు, ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. చక్కటి మాటతీరుతో పాటు, అందం కూడా ఆమెకు కలిసొచ్చేదే. అందుకే ఆమెకు డిమాండ్ బాగా ఎక్కువే. ఆరేళ్ల క్రితం బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలుగు ప్రేక్షకులందరికీ యాంకర్ శ్యామల సుపరిచితులు. యాంకరింగ్, టీవీ రంగంలోనూ, సినీరంగంలోనూ రాణిస్తూ తెలుగు ప్రేక్షలను ఆకట్టుకొంటున్నది. అయితే ఇటీవల ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో శ్యామల సోషల్ మీడియాకు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించారు.
తన జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని వివరిస్తూ.."ఒక నీలి చిత్రంలో నటించిన మోడల్ ఫేస్కు నా ఫేస్ను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో వీడియో పెట్టారు. అలా ఆ నీలి చిత్రంలో నన్ను చేర్చారు. అయితే వెంటనే ఆ వీడియో అప్డేట్ చేసిన వెబ్సైట్ వారితో మాట్లాడి ఆ వీడియోను తొలగించడం జరిగింది. నేను ఆ సమయంలో చాలా బాధపడ్డాను. నా భర్త ఆ వీడియోని చాలా తేలికగా తీసుకున్నారు. ఇంకో విషయం ఏమిటంటే సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియో.. నా భర్త నాకు షేర్ చేసేంత వరకు తెలియదు. తాను ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తే కావడంతో ఆ వీడియోని లైట్ తీసుకుని.. ఇలాంటివి సహజమే అంటూ పట్టించుకోలేదు. కానీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాకపోతే పరిస్థితేంటి? తలుచుకుంటేనే భయమేస్తుంది.." అంటూ తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తెలిపారు శ్యామల.