పవన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన అంబటి..

Update: 2018-07-29 03:14 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.  రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగత విషయాలంటూ ప్రత్యేకంగా ఏవీ ఉండవని గుర్తు చేసిన అయన..  మంచివ్యక్తినంటూ పవన్ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం హాస్యాస్పదన్నారు. నాలుగేళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో అంటకాగిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, ఇప్పుడు బయటకు వచ్చి టీడీపీని వదిలి అధికార పార్టీకంటే.. ప్రతిపక్ష వైసీపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబులానే పవన్‌ మాట్లాడుతున్నారని, ఆయన లానే ఈయన కూడా తనకు తానే ఉత్తముడని సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రివాల్వర్‌తో కాల్చుకుని చావాలనుకున్నానని పవన్‌ సభల్లో చెబుతున్నారని, జీవితంతో పోరాడలేక చావాలనుకున్న ఓ వ్యక్తి నిజంగా ధైర్యవంతుడా? అని ప్రశ్నించారు. తనకు అసెంబ్లీలో సభ్యులు ఉంటే సభను ఒక ఊపు ఊపేవాడినని పవన్‌ చేసిన వ్యాఖ్యలు కామెడీగా ఉన్నాయని .. అలాంటప్పుడు 2014 ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని అంబటి.. పవన్‌ను ప్రశ్నించారు. టీడీపీ రాజ్యసభ సీటు ఇస్తానంటే లేదూ.. తాను 50 నుంచి 60 సీట్లలో పోటీ చేస్తున్నట్టు చంద్రబాబుతో చెప్పానని అంటున్న పవన్..  రాజ్యసభ సీటు ఇవ్వనందుకే టీడీపీ నుంచి బయటకు వచ్చారా? అని మండిపడ్డారు అంబటి.

Similar News