జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో భద్రతాబలగాలు చేపట్టిన కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జకీర్ మూసా ముఖ్య అనుచరుడిని కూడా ఈ ఎన్కౌంటర్లో భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. పుల్వామాలోని అవంతిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టాయి. భద్రతాసిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఓ ఇంట్లో దాగి ఉన్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పుల జరిపిన సిబ్బంది ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చారు.
మృతిచెందిన ఉగ్రవాదులంతా జకీర్ మూసా నేతృత్వంలోని అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ ముఠాకు చెందిన వారని తెలుస్తోంది. మృతుల్లో ఒకడు జకీర్ ముఖ్య అనుచరుడు సోలిహా మహ్మద్గా గుర్తించారు. కాశ్మీర్ లోయలో అల్ఖైదా విభాగన్నే అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్. ఈ ముఠాకు చెందిన ఆరుగురిని మట్టుబెట్టడాన్ని ఆర్మీ భారీ విజయంగా భావిస్తోంది. అయితే, ఎన్కౌంటర్ నేపథ్యంలో పుల్వామాలో మరోసారి అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఘటన జరిగిన ప్రాంతంలో భద్రతాసిబ్బంది, ఆందోళనకారుల మధ్య ఘర్షణ జరిగింది.