సూరత్ః జీఎస్టీ ఏంటి.. పిల్లలకు పేర్లు పెట్టడం ఏంటని జుట్టు పీక్కోకండి. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన జీఎస్టీ ప్రకటన ఆ తల్లిలో స్పూర్తిని రగిలించింది. దేశ ప్రగతి కోసం మోదీ చేసిన ఈ ప్రకటనపై ఆమె హర్షం వ్యక్తం చేసింది. తను కూడా జీఎస్టీని సమర్థస్తూ గుర్తిండిపోయేలా ఏదైనా చేయాలనుకుంది. జీఎస్టీ ప్రకటన అనంతరం ఆమె ముగ్గురు పండటి బిడ్డలకు జన్మనిచ్చింది. అంతే ఆ పిల్లలకు జీఎస్టీ అని పేరు పెట్టేసింది. అదేం పేరు అనే సందేహం కలగొచ్చు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ముగ్గురి పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాలను కలిపి చదివితే జీఎస్టీ అని వచ్చేలా ఆమె తన పిల్లలకు పేర్లు పెట్టింది. ఒకరి పేరు గరవి, మరొక బిడ్డ పేరు సాంచి, మూడో బిడ్డ పేరు తరవి. ఇదీ ఈ జీఎస్టీ పేరులోని అసలు మర్మం. గుజరాత్ లోని సూరత్ లో కంచన్ పటేల్ అనే మహిళ ఈ కొత్త పేరుకు శ్రీకారం చుట్టింది. అయితే ఇలా ప్రభుత్వ పథకాల నుంచి ప్రేరణ పొంది.. పిల్లలకు పేర్లు పెట్టిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. రాజస్థాన్లోని ఓ కుటుంబం, ఛత్తీస్ఘర్లోని ఓ కుటుంబం కూడా జీఎస్టీ ప్రకటన తర్వాత తమ పిల్లలకు ఇలాంటి పేర్లే పెట్టాయి. అయితే ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టు.. వాటి పేర్లు కలిసొచ్చేలా పిల్లల పేర్లు పెట్టడం తప్పు కాదని, కానీ పిల్లలు పెరిగి పెద్దయ్యాక వారు నలుగురిలో నవ్వుల పాలు కాకుండా ఉండేలా తల్లిదండ్రులు ఆలోచించి నామకరణం చేయాలని కొందరు సూచిస్తున్నారు.