చెన్నైః కష్టాల్లో ఉన్న వారిని పరామర్శించి... వారికి ధైర్యం చెప్పే విషయంలో తమిళ సినీ ప్రముఖులు అందరి కంటే ఒకడుగు ముందే ఉంటారు. తమిళ సినీ ప్రముఖుల ఉదార స్వభావం ఇప్పటికే పలుమార్లు రుజువైంది. హీరో విజయ్ మరోసారి తమిళ సినీ పరిశ్రమలో మానవత్వం ఏ స్థాయిలో ఉందో నిరూపించాడు. వారం క్రితం తమిళనాడులో నీట్ నేపథ్యంలో.. తనకు అన్యాయం జరిగిందనే మనస్తాపంతో అనిత అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అనిత కుటుంబాన్ని హీరో విజయ్ పరామర్శించాడు. అండగా ఉంటానని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పాడు. ఎంత పెద్ద హీరో అయినప్పటికీ ఆ అహాన్ని ప్రదర్శించకుండా.. వారితో పాటు నేలపై కూర్చుని ఓదార్చాడు. ఈ దృశ్యాలను హీరో విజయ్ అభిమానులు కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో విజయ్ని పలువురు అభినందిస్తున్నారు. కష్టకాలంలో కావాల్సిన ధైర్యాన్ని అందించే ప్రయత్నం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అనిత కుటుంబానికి సానుభూతి తెలుపుతూ కోలీవుడ్ ప్రముఖులు కొందరు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అయితే తమిళ హీరోలకు సంబంధించి ఇటువంటి వార్తలొచ్చిన ప్రతిసారీ టాలీవుడ్పై విమర్శలొస్తున్నాయి. తెలుగు సినిమా హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతలు కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా బతుకుతున్నారని, తమిళ ప్రముఖులను స్పూర్తిగా తీసుకుని ఇకనైనా మానవీయ కోణంలో ఇలాంటి ఘటనలపై స్పందించాలని కొందరు నెటిజన్లు సూచిస్తున్నారు. అయితే ఈ వాదనను టాలీవుడ్ ప్రముఖులు కొట్టిపారేస్తున్నారు. హుద్హుద్ తుఫాను సమయంలో మేము సైతం వంటి కార్యక్రమం నిర్వహించి బాధితులకు అండగా నిలిచామని గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా తమిళ సినీ ప్రముఖులతో పోల్చితే తెలుగు సినీ తారలు ఈ విషయంలో వెనకబడి ఉన్నారని చెప్పక తప్పదు.