RTI అంటే ఏమిటి.. దీనిని ఎలా దాఖలు చేయాలి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!
RTI: మనం తరచుగా వార్తలలో ఆర్టీఐ గురించి వింటూ ఉంటాం. కానీ చాలామందికి దీని గురించి తెలియదు.
RTI అంటే ఏమిటి.. దీనిని ఎలా దాఖలు చేయాలి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!
RTI: మనం తరచుగా వార్తలలో ఆర్టీఐ గురించి వింటూ ఉంటాం. కానీ చాలామందికి దీని గురించి తెలియదు. దీనిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా తెలియదు. కానీ ఆర్టీఐ అనేది సామాన్యుడికి ఒక అస్త్రం లాంటిది. మీకు ఏదైనా ప్రభుత్వ కార్యాలయం గురించి సరైన సమాచారం కావాల్సినప్పుడు దాని చుట్టూ పదే పదే తిరగాల్సిన అవసరం లేదు. ఆర్టీఐ దాఖలు చేస్తే విలువైన సమాచారం మీ ముందు ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి హక్కుగా చెప్పవచ్చు. అయితే ఆర్టీఐ అంటే ఏమిటీ.. దానిని ఎలా దాఖలు చేయాలో ఈరోజు తెలుసుకుందాం.
RTI అంటే ఏమిటి?
RTI (Right to Information Act 2005) అంటే సమాచార హక్కు అని అర్థం. ఈ చట్టం ప్రకారం దేశంలోని ఏ పౌరుడైనా ఏ ప్రభుత్వ శాఖ నుంచైనా కావాల్సిన సమాచారం పొందవచ్చు. ప్రభుత్వ శాఖలో అవినీతిని నిరోధించడానికి హక్కుల గురించి సమాచారాన్ని పొందడానికి ఆర్టీఐ ఉపయోగపడుతుంది. వ్యవస్థను పారదర్శకంగా మార్చడానికి ఇది పనిచేస్తుంది. ఈ చట్టం 2005లో అవినీతికి వ్యతిరేకంగా రూపొందించారు. దీనిని సమాచార హక్కు అని పిలుస్తారు. ఆర్టీఐ కింద అభివృద్ధి పనులకు ఎంత డబ్బు వచ్చింది.. ఎంత ఖర్చు చేశారు తదితర సమచారం సేకరించవచ్చు. రేషన్ షాపుల్లో ఎంత రేషన్ వచ్చింది.. ఎంత పంపిణీ చేశారు.. వంటి కిందిస్థాయి వివరాల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఆర్టీఐ అనేది సామాన్యుడి హక్కుగా చెప్పవచ్చు.
RTI ఎలా దాఖలు చేయాలి..?
1. ఆన్లైన్లో RTI ఫైల్ చేయడానికి ముందుగా దాని అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయాలి.
2. ఇక్కడ సబ్మిట్ రెక్వెస్ట్ బటన్పై క్లిక్ చేయాలి. తర్వాత ఒక పేజీ ఓపెన్ అవుతుంది.
3. ఇక్కడ మార్గదర్శకాలను జాగ్రత్తగా చదివి ఆపై కన్ఫర్మ్పై క్లిక్ చేయాలి.
4. పూర్తి మార్గదర్శకాలను చదివినట్లయితే ఒకే బటన్పై క్లిక్ చేయాలి.
5. ఇప్పుడు ఒక ఫారమ్ ఓపెన్ అవుతుంది.
6. ఇందులో కావలసిన విభాగానికి సంబంధించిన సమాచారం ప్రకారం ఫారమ్ను పూర్తిగా నింపాలి. ఫారమ్లోని అన్ని వివరాలు సరిగ్గా ఉండాలని గుర్తుంచుకోండి.
7. తర్వాత అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
8. తర్వాత సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేయాలి.
9. ఇప్పుడు దిగువన ఉన్న సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
10. ఫారమ్ నింపిన తర్వాత రసీదుని పొందుతారు. దీనిని దగ్గర ఉంచుకోవాలి. ఫారమ్ స్టేటస్ని తనిఖీ చేస్తున్నప్పుడు ఈ రసీదు అవసరమవుతుంది.
RTI ముఖ్యమైన నియమాలు
1. భారత పౌరుడు ఏ ప్రభుత్వ కార్యాలయం నుంచైనా సమాచారాన్ని పొందవచ్చు.
2. RTI ఫైల్ చేయడం ద్వారా ఏదైనా పబ్లిక్ అథారిటీ నుంచి సమాచారాన్ని పొందవచ్చు. ఇది రాజ్యాంగం ప్రకారం స్థాపించబడిన అన్ని కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలకి వర్తిస్తుంది.
3. దరఖాస్తు చేస్తున్నప్పుడు దరఖాస్తుదారు ప్రభుత్వ సంస్థ ఖచ్చితమైన పేరును నమోదు చేయాలి.
4. దరఖాస్తుతో పాటు రూ.10 దరఖాస్తు రుసుము చెల్లించాలి. BPL కార్డ్ హోల్డర్లకు ఈ రుసుము ఉండదు. వివిధ రాష్ట్రాలను బట్టి ఈ రుసుము 8 నుంచి 100 రూపాయల మధ్య ఉంటుంది.
5. దరఖాస్తు చేసిన తర్వాత సమాచారం 30 రోజుల్లో అందుబాటులో ఉంటుంది. ముఖ్యమైన పత్రాలు ఉంటే 48 గంటల్లో పొందవచ్చు.
6. అప్లికేషన్లో తప్పులు ఉంటే దరఖాస్తు రద్దు చేస్తారు. ఉదాహరణకు అప్లికేషన్ స్పష్టంగా రాయకపోతే వివరాలు అసంపూర్తిగా ఉంటే, దరఖాస్తు తప్పుగా నింపితే వాటిని తిరస్కరిస్తారు.